ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి పదవికి, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా జీవీ రెడ్డి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, జాతీయ అధికార ప్రతినిధి హోదాకు, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.
తనపై ఉంచిన విశ్వాసానికి, మద్దతుకు, కీలకమైన బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో వేరే రాజకీయ పార్టీల్లో చేరే ఉద్దేశం లేదని జీవీ రెడ్డి స్పష్టం చేశారు. న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని తెలిపారు. రాజీనామా చేసిన కొద్దీ సేపటికే దానిని ఆమోదించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కాగా, వివాదానికి కేంద్రబిందువైన ఎండి దినేష్ కుమార్ ను బదిలీ చేస్తూ జీఏడీ వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
మరోవైపు ఫైబర్నెట్లో ఉద్యోగుల తొలగింపు, జీఎస్టీ చెల్లింపులు వంటి అంశాలపై జీవీ రెడ్డి ఇటీవల ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ మీద జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు. వైసీపీ సానుభూతిపరులుగా ఉన్న ఉద్యోగులను తొలగించినప్పటికీ ఎండీ ఆమోదం తెలపలేదని ఆరోపించారు. ఏపీ ఫైబర్నెట్ సంస్థను కనుమరుగు చేసేలా అధికారులు కుట్రలు చేస్తున్నట్లు అనుమానాలు వస్తున్నాయంటూ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తొమ్మిది నెలల్లో సంస్థలో ఎలాంటి పురోగతి లేదని, ఎండీ దినేష్ కుమార్ ఏపీ ఫైబర్నెట్ను చంపేయాలనుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఫైబర్నెట్లోని కొంతమంది ఉద్యోగులు రాజద్రోహానికి పాల్పడుతున్నారంటూ జీవీ రెడ్డి ఆరోపణలు చేశారు. వైసీపీకి సహకరించేలా వ్యవహరిస్తున్నారని, సంస్థకు నష్టం కలిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని జీవీ రెడ్డి ఆరోపించారు. అధికారుల తీరుపై సీఐడీ లేదా విజిలెన్స్ విచారణ కోరతానంటూ జీవీ రెడ్డి మాట్లాడటం ఇటీవల సంచలనం రేపింది.
ఈ నేపథ్యంలో పలువురు ఐఏఎస్లు జీవీ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం ఈ విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది. దీంతో జీవీ రెడ్డి రెండు రోజుల క్రితం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఏపీ ఫైబర్నెట్లో చోటు చేసుకున్న వ్యవహారాలను సీఎంకు వివరించారు.
ఈ సందర్భంగా సంస్థ అభివృద్ధి కోసం పనిచేయాలని చంద్రబాబు జీవీ రెడ్డికి సూచించినట్లు తెలిసింది. ఫైబర్ నెట్ ఎండీ, ఇద్దరూ కూర్చుని సమస్యను సర్దుబాటు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. తాను ఆరోపణలు చేసిన అధికారితో కలిసి పనిచేయమనడం, తన ఆరోపణలపై విచారణ జరిపి తగు చర్య తీసుకుంటానని హామీ ఇవ్వకపోవడంతో జివి రెడ్డి మనస్ధాపంకు గురైనట్లు తెలుస్తున్నది. అలాగే ఈ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను మంత్రి జనార్దన్రెడ్డికి అప్పగించారు. ఈలోపే జీవీ రెడ్డి ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

More Stories
వందల మొబైల్ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?
అమెరికా గుప్పిట్లో పాక్ అణ్వాయుధాలు
కశ్మీర్ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీని అడ్డుకున్న బీజేపీ