శంషాబాద్​​ ఎయిర్​పోర్ట్​లో ఇకపై సులభంగా ఇమ్మిగ్రేషన్

శంషాబాద్​​ ఎయిర్​పోర్ట్​లో ఇకపై సులభంగా ఇమ్మిగ్రేషన్

హైదరాబాద్ లోని శంషాబాద్‌ ఎయిర్​పోర్ట్​లో ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను అందించేందుకు కేంద్ర పౌర విమానయాన సంస్థ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖలు ప్రవేశపెట్టిన ఫాస్ట్‌ట్రాక్‌ ఇమిగ్రేషన్, డిజియాత్రలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. బోర్డింగ్‌ పాస్‌ కౌంటర్ల వద్ద రద్దీ నియంత్రణ, సులువుగా ఇమ్మిగ్రేషన్‌ పూర్తి చేసేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. 

ఫాస్ట్‌ట్రాక్‌ ఇమ్మిగ్రేషన్‌ విధానాన్ని జనవరి నెలలో ప్రారంభం చేశారు. తద్వారా విమాన ప్రయాణికులకు 20 నుంచి 30 నిముషాల సమయం ఆదా అవుతోందని, బోర్డింగ్‌ పాస్‌ కౌంటర్ల వద్ద అధిక మంది ఉంటే, ప్రయాణికులు ఎక్కాల్సిన విమానం చెక్‌-ఇన్‌ పూర్తి అవుతుందేమోనన్న ఆందోళన అవసరం లేదని ఎయిర్​పోర్ట్ అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌ నుంచి ఇతర దేశాలకు వెళ్లే వారు ఫాస్ట్‌ట్రాక్‌ ఇమ్మిగ్రేషన్‌లో తమ పేర్లను నెల రోజుల ముందు నమోదు చేసుకుంటే ఈ-గేట్‌ ద్వారా అనుమతిస్తారు. భారతీయ పాస్ట్‌పోర్టులు ఉన్నవారు, ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా కార్డుదారుల కోసం ప్రత్యేకంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత జనవరి 16న వర్చ్యువల్ గా ప్రారంభించారు.

ఫాస్ట్‌ట్రాక్‌ ఇమ్మిగ్రేషన్‌తో ఎయిర్​పోర్టుకు వచ్చిన వెంటనే వీసా తనిఖీ, బోర్డింగ్‌ పాస్‌ కోసం ప్రయాణికుల చెక్‌-ఇన్‌ కౌంటర్లను సందర్శిస్తే చాలు. మరిన్ని వివరాలకు సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు పేర్కొన్నారు. డిజియాత్ర యాప్‌లో పేర్లు నమోదు చేసుకున్న వారికి శంషాబాద్‌ ఎయిర్​పోర్ట్​లో చెక్‌-ఇన్‌ కౌంటర్ల వద్ద ప్రత్యేక వరుసలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 

డిజియాత్ర ప్రత్యేక కౌంటర్లకు బెంగళూరు, శంషాబాద్‌ ఎయిర్​పోర్ట్​లో ఆదరణ లభించడంతో గత సంవత్సరం మార్చిలో చెన్నై ఎయిర్​పోర్ట్​లోనూ ప్రారంభించారు. మరికొన్ని ఎయిర్​పోర్ట్​ల్లో ఒకటి, రెండు నెలల్లో ఆరంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.