శ్రీశైలం ఎడమ టన్నెల్‌లో ఘోర ప్రమాదం

శ్రీశైలం ఎడమ టన్నెల్‌లో ఘోర ప్రమాదం

* చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు

తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంటలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనుల్లో  ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ 14వ కిలోమీటర్‌ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. టన్నల్ బోర్ మెషిన్‌తో పని జరుగుతున్నప్పుడు అక్క‌డ ఎనిమిది మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. వారంతా అక్క‌డే చిక్కుకుపోయారని మంత్రి ఉత్త‌మ‌కుమార్ రెడ్డి వెల్ల‌డించారు.

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఈరోజు ఉదయం 8:30 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎస్ఎల్‌బీసీ ఎడమవైపు సొరంగం పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. అయితే నాలుగు రోజుల క్రితమే ఎడమవైపు సొరంగం పనులు మొదలయ్యాయి.  ఇంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాద సమయంలో భారీ శబ్ధం రావడంతో చుట్టుపక్కల పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై లోపలికి పరిగెత్తారు.  ఉదయం షిఫ్ట్‌లో సొరంగంలో పనులకు 50 మంది కార్మికులు వెళ్లారు. సొరంగంలో ఏర్పాటు చేసిన రింగ్‌లు కింద పడటంతో ప్రమాదం జరిగింది. ఒక్కొక్కరిగా సొరంగం నుంచి 43 మంది కార్మికులు బయటకు వచ్చారు. ఇంకా సొరంగంలో ఏడుగురు కార్మికులు చిక్కుకున్నారు. సొరంగంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పోలీసుల సాయంతో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

ప్ర‌ధానంగా మ‌ట్టి పెళ్ల‌లు రిగ్ పై ప‌డ‌టంతో అది క‌ద‌లి అవ‌కాశం లేక‌పోయింద‌ని తెలిపారు. దీనితో స‌హాయ కార్య‌క్ర‌మాల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కోసం కేంద్రాన్ని అభ్య‌ర్ధించగా మూడు బృందాలు అక్క‌డికి బ‌య‌లుదేరాయి . విజ‌య‌వాడ నుంచి రెండు, హైదరాబాద్ నుంచి ఒక బృందం అక్క‌డికి మ‌రికొద్ది సేప‌ట్లో అక్క‌డికి చేరుకోవ‌చ్చ‌ని మంత్రి చెప్పారు.  ఈ రాత్రికి లోప‌ల చిక్కుకున్న వారిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకొస్తామ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద ప్రమాదంపై \ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని సీఎంఆదేశించారు.  ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలీకాప్టర్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు. నల్లగొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రాజెక్టును రూపొందించారు.

2005లో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు నాటి వైఎస్సార్‌ ప్రభుత్వం రూ.2,200 కోట్లతో పరిపాలన అనుమతులు జారీ చేసింది. రూ.1925 కోట్లతో సుమారు 60 నెలల్లో పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ పనులకు ఒప్పుకుంది. శ్రీశైలం జలాశయం నుంచి నల్లగొండ జిల్లాకు 30టీఎంసీల కృష్ణా జలాలను తరలించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం.

టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌తో సొరంగం తవ్వకాలు చేపట్టగా సాంకేతిక సమస్యలు, వరద సమస్యలతో పనులు ఆగుతూ వచ్చాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హాయంలో టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ మరమ్మతులకు గురవ్వడం, నిధుల కేటాయింపులు లేకపోవడంతో సొరంగం ప్రాజెక్టు పనులు 2019 డిసెంబర్‌ నుంచి మూలపడ్డాయి. అయితే నల్లగొండ మంత్రుల చొరవతో తాజాగా  పనులు మళ్లీ మొదలయ్యాయి.

ఇప్పటివరకు ప్రభుత్వాలు ఆరుసార్లు ఈ ప్రాజెక్టు పనుల గడువును పొడిగించాయి. తాజా గడువు కూడా జూన్‌ 2026 వరకు ఉంది. 2017లో ఈ ప్రాజెక్టు అంచనాలను రూ.3,152.72 కోట్లకు పెంచగా, ఈ మధ్యే మరోసారి 4,637 కోట్లకు పెంచారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు రూ.2,646 కోట్లు ఖర్చు చేశారు.