పాకిస్థాన్ జైలు నుంచి 22 మంది మత్స్యకారులు విడుదలయ్యారు. వారి శిక్షాకాలం పూర్తి కావడం వల్ల కరాచీలోని మాలిర్ కారాగారం నుంచి శుక్రవారం బయటకు వచ్చారు. శనివారం ఆ మత్స్యకారుల్ని భారత్కు అప్పగించే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ క్రమంలో భారత జాలర్లకు ఈది ఫౌండేషన్ సహాయసహకారాలు అందించింది. వారు కరాచీ నుంచి లాహోర్కు వెళ్లడానికి కావాల్సిన రవాణా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి వారు భారత్కు రానున్నారు. ఆ సంస్థ మత్స్యకారులకు ప్రయాణ ఖర్చులు, కొన్ని బహుమతులు, నగదు అందించింది.
ఈ సందర్భంగా భారత్-పాక్ ప్రభుత్వాలకు ఈది ఫౌండేషన్ ఛైర్మన్ ఫైజల్ ఈది ఒక అభ్యర్థన చేశారు. ఎలాంటి దురుద్దేశం లేకుండా పొరపాటున అంతర్జాతీయ జలాల సరిహద్దులు దాటుతున్న వారిపై దయతో వ్యవహరించాలని అభ్యర్థించారు. వాఘా సరిహద్దు ద్వారా పాక్ అధికారులు ఈ జాలర్లను భారత్కు అప్పగిస్తారు. అన్ని ప్రక్రియలు పూర్తిచేసిన తర్వాత మన అధికారులు వారిని స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తారు.
మత్స్యకారులు సరిహద్దులను సరిగా గుర్తించకపోవడం వల్ల ఇరువైపులా ఈ అరెస్టులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే జనవరి 1న ఇరుదేశాల ఖైదీల జాబితా మార్పిడి జరిగింది. పాకిస్థాన్లో 266 మంది భారత ఖైదీలు ఉన్నారు. భారత జైళ్లలో మొత్తం 462 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు మన దేశ జాబితా పేర్కొంది.

More Stories
గ్రోక్లో అసభ్య చిత్రాలు.. ఎలాన్ మస్క్పై మాజీ లవర్ దావా
ఎఐ సంపన్నుల చేతుల్లో ఆయుధం.. భవిష్యత్ లో ముప్పు
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడుకు 5 ఏళ్ళు జైలు శిక్ష