జమ్మూకశ్మీర్‌పై ఎర్డోగాన్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం

జమ్మూకశ్మీర్‌పై ఎర్డోగాన్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం
జమ్మూకశ్మీర్‌కు సంబంధించి పాకిస్థాన్ పర్యటనలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఎర్డోగాన్ వ్యాఖ్యలు అనుచితమని, ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత విదేశాంగ శాఖ  ప్రతినిధి రణ్‌దీప్ జైశ్వాల్ స్పష్టం చేశారు. వారంవారం జరిపే మీడియా సమావేశంలో జైశ్వాల్ శుక్రవారంనాడు మాట్లాడుతూ, ఎర్డోగాన్ వ్యాఖ్యలపై టర్కీ అంబాసిడర్‌కు భారత్ తీవ్ర నిరసన తెలియజేసిందని చెప్పారు. 
 
భారతదేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి సంబంధించి ఎర్డోగాన్ వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, భారత్‌కు వ్యతిరేకంగా చొరబాట్లు, సరిహద్దు ఉగ్రవాదాన్ని పాక్ ప్రేరేపిస్తోందని, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద విధానమే జమ్మూకశ్మీర్‌కు అసలైన ముప్పుని తేల్చి చెప్పారు.

పాక్‌లో రెండ్రోజుల అధికార పర్యటనలో భాగంగా ఎర్డెగోన్ కశ్మీర్ అంశంపై మాట్లాడారు. కశ్మీర్ సమస్యను ఇండియా, పాకిస్థాన్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుగుణంగా ఉభయదేశాలు చర్చించుకోవాలని హితవు చెప్పారు. కశ్మీర్ సోదరులకు తాము సంఘీభావం తెలుపుతున్నట్టు ఆయన ప్రకటించారు.

కాగా, కేంద్ర పాలత ప్రాంతాలైన జమ్ము, కశ్మీర్, లద్దాఖ్‌లు భారతదేశంలో అంతర్భాగమని భారత్ పదేపదే స్పష్టం చేస్తోది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను 2019 ఆగస్టు 5న రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. తిరిగి రాష్ట్ర హోదా కల్పించే దిశగా ఇటీవల జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు సైతం నిర్వహించింది. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.