ప్రపంచ దేశాల మధ్య విభేదాలువిచ్ఛిన్నానికి దారితీయరాదు

ప్రపంచ దేశాల మధ్య విభేదాలువిచ్ఛిన్నానికి దారితీయరాదు
 
* ఉగ్రవాదాన్ని భారత్‌ ప్రోత్సహించదు 

ప్రపంచ దేశాల మధ్య విభేదాలు వివాదాలుగా మారి విచ్ఛిన్నానికి దారితీయకూడదని భారత కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్‌ కోరారు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న మంత్రి జై శంకర్‌ జి-20 విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ రాబోయేకాలంలో కృత్రిమ మేథ, ఎలక్ట్రిక్‌ వాహనాలు, అంతరిక్షం, డ్రోన్లు, గ్రీన్‌ హైడ్రోజన్‌ వంటి అంశాల్లో భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం కచ్చితంగా ఉంటుందని చెప్పారు. 

ఏ కోణంలో చూసినా ప్రపంచ రాజకీయ పరిస్థితి సంక్లిష్టంగానే ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సంఘర్షణ పరిస్థితులు, ఆర్థిక ఒత్తిళ్లు, ఆహార భద్రత, కొవిడ్‌ మహమ్మారి సవాళ్లు, వాతావరణ ఆందోళనలను ప్రపంచ దేశాలన్నీ ఎదుర్కొంటున్నాయని తెలిపారు. జి-20 మన ఆసక్తులు, సంస్కృతులు, దృక్పథాల వైవిధ్యాన్ని సంగ్రహిస్తుందని చెప్పారు.

ఈ సమస్యలను ఎదుర్కోవడంలో, ప్రపంచ దేశాల ఎజెండాను ముందుకు తీసుకువెళ్లడంలో జి-20 కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. ఈ సమాఖ్యను కాపాడుకోవడం ప్రపంచ దేశాల తక్షణ కర్తవ్యమని తెలిపారు.  పశ్చిమాసియా ఘర్షణలు, సముద్ర భద్రత, ఉక్రెయిన్‌ వివాదం, ఇండో-పసిఫిక్‌, యూఎన్‌ సంస్కరణలపై భారతదేశ వైఖరిని జైశంకర్‌ వెల్లడించారు.

గాజా కాల్పుల విరమణ, బందీల విడుదలను దేశం స్వాగతిస్తోందని చెబుతూ భారత్‌ ఎప్పుడూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించబోదని, మానవతా సహాయానికి మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఘర్షణలు నెలకొంటున్న ఆయా ప్రాంతాల్లో శాంతి, సుస్థిరత నెలకొనడం ప్రపంచ దేశాలకు చాలా అవసరమని జైశంకర్ స్పష్టం చేశారు. 

క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఒకదానికి ఒకటి సహాయ, సహకారాలు అందించుకోవాలని, అంతర్జాతీయ చట్టం ప్రకారం కుదుర్చుకున్న ఒప్పందాలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి జై శంకర్‌ కోరారు. రష్యా-ఉక్రెయిన్‌ వివాదంపై జైశంకర్‌ మాట్లాడుతూ యుద్ధం నివారించడానికి ఇరుదేశాల అధినేతలు చర్చల్లో పాల్గొనాలని భారత్‌ చాలాకాలంగా సూచిస్తోందని చెప్పారు. భారత్‌ యుద్ధాన్ని ప్రోత్సహించబోదని, దౌత్యాన్ని సమర్థిస్తుందని పేర్కొంటూ ఈ సమస్యకు త్వరలో ముగింపు పలకాలని కోరుతున్నామని తెలిపారు.