26/11 ముంబై దాడి నిందితుడు అప్పగింతకు ట్రంప్ అంగీకారం

26/11 ముంబై దాడి నిందితుడు అప్పగింతకు ట్రంప్ అంగీకారం

ముంబయిలో భీకర ఉగ్రదాడిని తలచుకుంటే ఇప్పటికీ వణుకు పుడుతుంది. నాటి ఘటనలో దోషిగా తేలిన తఃపూర్ రాణాను  భారత్‌ కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుమతిచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ  అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ ప్రకటన రావడం గమనార్హం.

 
“26/11 ముంబై ఉగ్రదాడిలో  నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌కు అప్పగిస్తున్నాం” అని ట్రంప్ విలేకరులతో పేర్కొన్నారు.  ఈ ప్రకటనపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ముంబయి ఉగ్రదాడి నేరస్థుడిని భారత్‌కు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసిన ట్రంప్‌నకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 
 
తహవూర్‌ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి. ప్రస్తుతం లాస్‌ ఏంజెలెస్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని తమకు అప్పగించాలంటూ కొంతకాలంగా భారత్‌ పోరాడుతోంది. దీన్ని సవాల్‌ చేస్తూ తహవూర్‌ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా  ఆయా న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలోని యుఎస్ కోర్టు ఆఫ్‌ అప్పీల్‌లోనూ చుక్కెదురైంది.దీంతో చివరి ప్రయత్నంగా గతేడాది నవంబరు 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశాడు. దీన్ని కొట్టివేయాలని అమెరికా ప్రభుత్వం న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తూ 20 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు రాణా అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో అతడిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. తాజాగా రాణా అప్పగింతపై ట్రంప్ ప్రకటన చేశారు. దీంతో మరికొన్ని నెలల్లోనే అతడిని భారత్‌కు అప్పగించే అవకాశాలున్నాయి.