
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని విపక్షాలు చేస్తున్న విమర్శలను కొట్టిపారవేస్తూ ఏపీ విభజన సమయంలో తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంటే ఇప్పుడు అప్పుల కుప్పగా మార్చారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ధ్వజమెత్తారు. రాజ్యసభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తావించారు.
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపదని, పైగా ఏ పార్టీని కూడా తప్పు పట్టడం లేదని ఆమె స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ నియోజకవర్గంలో తొలుత రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వం అని, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించింది నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని ఆమె గుర్తు చేశారు.
ఎరువుల ఉత్పత్తిలో రికార్డు స్థాయిలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచామని, నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఘనత నరేంద్ర మోదే అని ఆమె తెలిపారు. అత్యద్భుతమైన పసుపు పండే ప్రాంతం నిజామాబాద్ అంటూ తెలంగాణకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్లో పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేసినందుకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని ఆమె వెల్లడించారు.
వరంగల్లో పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేశామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గుర్తు చేశారు. సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని, బీబీనగర్ లో ఎయిమ్స్ ఏర్పాటు చేశామని ఆమె వివరించారు. 2605 కిలోమీటర్ల జాతీయ రహదారులను వేశామని, భారత్ మాల కింద నాలుగు గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేశామని ఆమె పేర్కొన్నారు.
రూ.5,337 కోట్ల బడ్జెట్ను రైల్వేల అభివృద్ధి కోసం తెలంగాణకు కేటాయించామని, ఏరుపాలెం నంబూరు మధ్య , మల్కాన్ గిరి పాండురంగాపురం మధ్య 753 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ నిర్మించామని ఆమె వివరించారు. ఐదు కొత్త వందేభారత్ ట్రైన్లను తెలంగాణకు ఇవ్వడంతోపాటు 40 రైల్వే స్టేషన్లు రీడెవలప్ చేశామని స్పష్టం చేశారు.
పీఎం ఆవాస్ అర్బన్ కింద రెండు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, 31 లక్షల టాయిలెట్లను స్వచ్ఛ భారత్ మిషన్ కింద నిర్మించామని ఆర్ధిక మంత్రి చెప్పారు. జల్జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చామని, 82 లక్షల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులను ఇవ్వడంతోపాటు 199 జనఔషది కేంద్రాలను ఏర్పాటు చేశామని నిర్మాల సీతారామన్ తెలిపారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సరైన ప్రాధాన్యత దక్కిందని ఆమె పేర్కొంటూ బడ్జెట్లో బీహార్తో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారనడం సరికాదని ఆమె హితవు చెప్పారు. తెలంగాణలో కూడా నిధులు ఇచ్చామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
More Stories
మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
అమెరికాలో పోలీసు కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి!