స్థానిక సంస్థల ఎన్నికలు ఇక ఇప్పట్లో లేనట్లే

స్థానిక సంస్థల ఎన్నికలు ఇక ఇప్పట్లో లేనట్లే

వారం రోజులలో షెడ్యూల్ ప్రకటిస్తారనుకున్న స్థానిక సంస్థల ఎన్నికలను మరోసారి కులగణన జరిపే పేరుతో వాయిదా వేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధపడుతుంది. దానితో ఇప్పటిలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. స్థానిక ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

అయితే, బిసి రిజర్వేషన్ల పెంపునకు మార్చిలో కేబినెట్ ఆమోదం పొందిన అనంతరం అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేయాల్సి ఉంటుంది. మార్చిలో జరిగే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా బిసి బిల్లు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కాగా, అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన రిజర్వేషన్లకు చట్టభద్దత లభించదు. 

అందుకు పార్లమెంట్‌లో కూడా రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం ఆమోదం పొందవలసి ఉంటుంది. అయితే ఇప్పటికే కేంద్ర బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగిసే నాటికి పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడతాయి. తిరిగి వర్షాకాల సమావేశాల సందర్భంగానే పార్లమెంట్ సమావేశం కానున్నది. 

ఆ సమావేశాలు ఆరు నెలల వ్యవధి తర్వాత జులై, సెప్టెంబర్ మధ్యన జరుగనున్నాయి. ఒకవేళ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిసి రిజర్వేషన్ల పెంపు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించాలంటే అప్పటిదాకా ఆగాల్సిందే. బిసి రిజర్వేషన్ల పెంపు అంశం ఇలాంటి అనేక సాంకేతిక సమస్యలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. 

ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి రావలసిన నిధులు ఆగిపోతాయని తెలిసినప్పటికీ రిజర్వేషన్ల ఆమోదానికి సాంకేతిక కారణాలు ముడిపడి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అందుకు కూడా సిద్ధపడినట్లు కనిపిస్తుంది. 

విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని మల్లు భట్టివిక్రమార్క దృష్టికి తీసుకురాగా, ఆయన కూడా ఆ విషయాన్ని ధృవీకరించారు. ప్రజలకు కొంతకాలం పాటు ఆర్థిక నష్టాన్ని కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ కారణాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసి ఇప్పటికే ఏడాది పూర్తయినప్పటికీ కనీసం మరో ఆరు నెలలైనా ఆగకతప్పని పరిస్థితులు నెలకొన్నాయి. 

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఈ మేరకు ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపింది. దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఇసి సిద్ధమవుతున్న సమయంలో మళ్లీ కులగణన, బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చింది.