
అతి తక్కువ కాలంలోనే జాతీయ పార్టీ హోదాను పొందిన ఆమ్ ఆద్మీ పార్టీకి తాజా డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనేక రాష్ట్రాల్లో ‘డిల్లీ మోడల్’ను ప్రచారం చేసుకున్న ఆ పార్టీకి ఇప్పుడది పునరాలోచనలో పడేసింది. ఈ క్రమంలో పంజాబ్లో మాత్రమే అధికారంలో ఉన్న ఆప్నకు తన విధానం మార్చుకునే పరిస్థితి ఏర్పడిందని పలువురు భావిస్తున్నారు.
పార్టీ పనితీరును మెరుగుపరచుకోవాలంటే పంజాబ్లో నిర్దిష్ట అభివృద్ధి మోడల్పై దృష్టి సారించాల్సిందేనని సూచిస్తున్నారు. ప్రజల తిరస్కరణకు గురైన ఆప్ నేతలు చెప్పిన ఢిల్లీ మోడలే కొనసాగిస్తే పంజాబ్ లో ఇబ్బందులు తప్పక పోవచ్చని హెచ్చరిస్తున్నారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే పంజాబ్లో నిర్దిష్ట ప్రణాళిక అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
దశాబ్దంకు పైగా డిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ పొరుగు రాష్ట్రాలపై ప్రభావాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పంజాబ్లో ఉచిత కరెంటు, మహిళలకు నెలకు రూ.వెయ్యి, విద్యతోపాటు మెరుగైన ఆరోగ్య సదుపాయాలతో ఢిల్లీ తరహాలో అభివృద్ధి చేస్తామని ఆప్ హామీ ఇచ్చింది. 2022లో పంజాబ్లో 117 స్థానాలకు గాను 92 చోట్ల విజయం సాధించి అధికారం చేపట్టింది.
2024లో లోక్సభ ఎన్నికల్లో మాత్రం 13స్థానాలకు గాను కేవలం మూడు స్థానాల్లోనే విజయం సాధించగలిగింది. ఇక డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా మంత్రులు, ఆప్ అగ్రనేతలు విస్తృత ప్రచారం చేశారు. పంజాబ్లో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పినప్పటికీ, డిల్లీ ప్రజలు మాత్రం ఏ మాత్రం మొగ్గు చూపలేదు.
దీంతో రానున్న రోజుల్లో పంజాబ్లో ఆప్నకు సవాళ్లు ఎదురుకావడమమే కాకుండా 2027 అసెంబ్లీ ఎన్నికల ముందు విపక్షాలకు ఒక మంచి అవకాశంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో నేతలు ప్రలోభాలకు గురికాకుండా చూసుకోవడం, పార్టీని ఏమేరకు పటిష్టంగా ఉంచుతుందనే విషయంపైనే ఆప్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు.
More Stories
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం