చత్తీస్‌గఢ్‌లో మరో 31 మంది మావోయిస్టులు మృతి

చత్తీస్‌గఢ్‌లో మరో 31 మంది మావోయిస్టులు మృతి

* ఇద్దరు జవాన్లు, మరో ఇద్దరు కూడా మృతి

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మరో భారీ ఎన్​కౌంటర్​లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలోనే  ఇద్దరు జవాన్లు, మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి.  మావోయిస్టుల కోసం డీఆర్‌జీ, ఎస్​టీఎఫ్‌, కోబ్రా బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పశ్చిమ బస్తర్‌ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టుల కదలికలకు సంబంధించి భద్రతా దళాలకు కీలక సమాచారం అందింది. దీంతో బీజాపుర్ జిల్లాలోని ఇంద్రావతీ నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో ఆదివారం భద్రతా బలగాలు యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలోనే మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతి చెందిన, పలువురు గాయపడ్డారు. 

ఈ ఘటనపై బస్తర్‌ ఐజీ పి.సుందర్‌రాజు స్పందించారు .భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మరణించినట్లు ధ్రువీకరించారు. ఛత్తీస్‌గఢ్‌ చరిత్రలోనే రెండో భారీ ఎన్‌కౌంటర్‌గా దీన్ని పేర్కొంటున్నారు. గతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 41 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2026 నాటికి మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం తుడిచిపెడుతుందని జనవరి 6న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్న నేపథ్యంలో ఆపరేషన్లు వేగవంతమయ్యాయి.

నక్సల్స్ ముప్పును అంతం చేయాలనే నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, “సైనికుల త్యాగం వృధా కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో, మన రాష్ట్రం మార్చి 2026 నాటికి నక్సలిజం నుండి విముక్తి పొందుతుంది. ఈ దిశలో, భద్రతా దళాలు నిరంతరం విజయం సాధిస్తూ, లక్ష్యం వైపు వేగంగా కదులుతున్నాయి. దేశంలో మరియు రాష్ట్రంలో క్యాన్సర్ లాంటి నక్సలిజం అంతం కావడం ఖాయం” అని తెలిపారు. 

గత ఐదురోజుల క్రితం బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఆ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టుల మృతి చెందినట్లు పోలీసు వర్గాలు ధృవీకరించాయి.  మూడు రోజుల క్రితం నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. పలువురు గాయపడ్దారు

ఆపరేషన్ కగార్ పేరుతో చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న దండకారణ్యం మొత్తాన్ని భారీగా భద్రతా బలగాలు నలువైపులా చుట్టుముట్టి వరుసగా ఎన్‌కౌంటర్లు చేస్తున్నారు. జనవరి 16న బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా.. అగ్రనేతలు తప్పించుకున్నట్లు బస్తర్ ఐజి పి.సుందర్‌లాల్‌ తెలిపారు.

అలాగే జనవరి 21 గరియాబాద్ ఎన్‌కౌంటర్‌లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ సరిహద్దుగా ఉన్న బీజాపూర్ జిల్లాలోని పామేడు, బాసగూడ, ఊసురు గంగ పోలీస్‌స్టేసన్ పరిధిల్లోనే ఎక్కవగా సెర్చ్ ఆపరేషన్‌ కొనసాగుతోంది. 

తెలంగాణ సరిహద్దు సౌత్ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు సుప్రీం కమాండర్‌గా ఉన్న మడవి హిడ్మాతో పాటు తెలంగాణ కార్యదర్శి ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో భారీగా సెర్చ్ ఆపరేషన్‌ కొనసాగుతోంది. నిత్యం భద్రతాబలాగాలు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న కాల్పులు, ప్రతి కాల్పులతో దండకారణ్యం ఒక యుద్ధ భూమిగా మారిన పరిస్థితి నెలకొంది.