బ్యాంకు స్టేట్‌మెంట్ల కోసం కర్ణాటక హైకోర్టుకు విజయ్ మాల్యా

బ్యాంకు స్టేట్‌మెంట్ల కోసం కర్ణాటక హైకోర్టుకు విజయ్ మాల్యా
భారత బ్యాంక్‌లకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి 2016లో లండన్‌ పారిపోయిన కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్ మాల్యా తాజాగా కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను బ్యాంకులకు చెల్లించిన రికవరీలకు సంబంధించి అకౌంట్‌ స్టేట్‌మెంట్లను అందించాలని పిటిషన్‌ దాఖలు చేశారు. తాను తీసుకున్న అప్పులకు మించి అనేక రెట్లు బ్యాంకులు తన నుంచి వసూలు చేశాయని కోర్టుకు తెలిపారు. 
 
అందుకు సంబంధించిన అకౌంట్‌ స్టేట్‌మెంట్లను అందించాలని కోరారు. తనతో పాటు ప్రస్తుతం లిక్విడేషన్‌లో ఉన్న యుబిహెచ్‌ఎల్‌ తదితర సంస్థల నుంచి వసూలు చేసిన మొత్తాల వివరాలను కూడా కావాలని అడిగారు. దీనిపై న్యాయస్థానం విచారణకు తీసుకుంది.  కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ దాదాపు రూ.6,200 కోట్ల అప్పులు తీసుకుందని మాల్యా తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దీనికి సంబంధించి రూ.14,000 కోట్లను రికవరీ చేశారన్నారు. ఇదే విషయమై పార్లమెంట్‌లోనూ ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన కూడా చేశారని పేర్కొన్నారు. మాల్యాకు చెందిన రూ.14,131 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంక్‌లు రికవరీ చేసినట్లు మంత్రి ప్రకటించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మాల్యా తీసుకున్న రుణంలో దాదాపు రూ.10,200 కోట్లు చెల్లించినట్లు రికవరీ అధికారులు కూడా పేర్కొన్నారు. 
 
మాల్యా న్యాయవాది వాదనలు విన్న జస్టిస్ ఆర్ దేవాదస్ సారథ్యంలోని హైకోర్టు ధర్మాసనం  దీనిపై స్పందించాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పిఎన్‌బి) సహా 10 బ్యాంక్‌లకు కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ.. ఫిబ్రవరి 13 లోగా స్పందించాలని ఆదేశించింది. రుణాల ఎగవేత ఆరోపణలు రావడంతో 2016 మార్చిలో మాల్యా దేశం విడిచి పారిపోయి బ్రిటన్‌లో ఉంటున్నారు. 

మాల్యాను రప్పించడానికి భారత్ ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే, తాను రూ.6,203 కోట్లు రుణాలు తీసుకుంటే బ్యాంకులు రూ.14,131,60 కోట్లు రికవరీ చేసుకున్నాయని, అయినప్పటికీ తాను ‘ఎకనాఫిక్ అఫెండర్’గానే కొనసాగాల్సి వస్తోందని 2024 డిసెంబర్ 18న మాల్యా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పేర్కొన్నారు.