ఛత్తీస్‌గఢ్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. బీజాపూర్‌ జిల్లా గంగులూర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి.  మావోయిస్టుల గురించి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గంగులూర్‌ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టారు.

ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పోలీసులు, నక్సల్స్‌కు మధ్య ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం ఇంకా మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.  ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉన్నది. ఇటీవల కాలంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగులుతున్నది. పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి చలపతితో పాటు 16 మంది వరకు మావోలు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.

తాజాగా జరిగిర ఎన్‌కౌంటర్‌లో మరో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు.  2026, మార్చి మాసాంతానికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే దాదాపుగా మావోయిస్టులు తుడుచు పెట్టుకు పోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మాత్రం వారి జాడ ఇంకా ఉంది. దీంతో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. అందులోభాగంగా మావోయిస్టులు లొంగి పోయి జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.