మొదటిసారి విదేశాల నుండి నిప్పు రవ్వలు లేవు

మొదటిసారి విదేశాల నుండి నిప్పు రవ్వలు లేవు
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా దశాబ్దం తర్వాత తొలిసారిగా “విదేశాల నుండి నిప్పురవ్వలు” లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయని అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రతిపక్షాలపై తీవ్రను ఎద్దేవా చేశారు.
 
“నేను ఇక్కడకు వచ్చిన పదేళ్లలో ఇదే మొదటిసారి. మన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా విదేశీ తీరాల నుండి ఎటువంటి నిప్పురవ్వలు రాలేదు. ఎటువంటి ప్రయత్నం జరగలేదు, విదేశీ కుట్ర జరగలేదు” అని ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గుర్తు చేశారు.
 
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాలు గతంలో లేవనెత్తిన అనేక అంశాలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఇటీవల మూసేసిన అమెరికా షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై స్టాక్ తారుమారు ఆరోపణలు, అంతకుముందు పెగాసస్ నిఘా సాఫ్ట్‌వేర్ సమస్య, చాలా కాలం క్రితం ఫ్రాన్స్‌తో రాఫెల్ ఒప్పందం వంటి ఎటువంటి విదేశీ ప్రకటనల నిప్పురవ్వలు, కుట్రలు లేకుండా ఈ సారి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయని అంటూ చెప్పుకొచ్చారు.

పార్లమెంట్‌ సమావేశాలు  ఈ సారి సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నట్లు ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడోసారి ఎన్డీయేకు ప్రజలు పట్టం కట్టారని గుర్తు చేస్తూ పార్లమెంట్‌లో సంపూర్ణ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఈ బడ్జెట్‌ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పేదలు, సామాన్యులపై మహాలక్ష్మి కృప ఎప్పటికీ ఉండాలని ఆకాంక్షించారు. భారత శక్తి సామర్థ్యాలు మనకు విశేష గుర్తింపునిస్తాయని చెబుతూ ఈ బడ్జెట్‌ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్‌ ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ బడ్జెట్‌ వికసిత్‌ భారత్‌కు ఊతం ఇస్తుందనిపేర్కొంటూ వికసిత్‌ భారత్‌ 2047 లక్ష్యంతో పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. ఇన్నోవేషన్‌, ఇన్‌క్లూజన్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యంతో దూసుకెళ్తున్నట్లు చెప్పారు. కొత్త విధానాలపైనే ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుందని మోదీ వివరించారు. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరిగేలా సభ్యులు సహకరించాలని, బిల్లులకు విపక్షాలు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.