లాకప్‌ డెత్‌ లో ఐజీ సహా 8 మంది పోలీసులకు జీవితఖైదు

లాకప్‌ డెత్‌ లో ఐజీ సహా 8 మంది పోలీసులకు జీవితఖైదు

లాకప్‌ డెత్‌ కేసులో దోషులుగా తేలిన 8 మంది పోలీస్‌ అధికారులకు సీబీఐ ప్రత్యేక కోర్టు జీవితఖైదు విధించింది. అంతేగాక ఒక్కొక్కరు లక్ష రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. హిమాచల్‌ప్రదేశ్‌ కు చెందిన ఈ లాకప్‌ డెత్‌ కేసు విచారణ చేపట్టిన సీబీఐ స్పెషల్‌ కోర్టు జడ్జి అల్కా మాలిక్ ఈ నెల 18న నిందితులను దోషులుగా తేల్చారు. సోమవారం శిక్ష ఖరారు చేశారు.

వివరాల్లోకి వెళ్తే హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో 2017 జూలై 4న 16 ఏళ్ల బాలికపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమెను హత్యచేసి నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న కొట్ఖాయ్‌ స్టేషన్‌ పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. 

అనంతరం ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌ ఘటనకు బాధ్యులైన ఏడుగురిని గుర్తించి అరెస్ట్ చేసింది. సిట్‌ విచారణ జరగుతుండగా నిందితుల్లో ఒకడైన సూరజ్‌ లాక్‌ప్‌లో మరణించాడు. దాంతో పోలీసులు అత్యాచారం కేసులో మరో నిందితుడైన రాజిందర్‌ ఈ కేసులో హంతకుడిగా చేర్చి తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. 

విషయం బయటికి రావడంతో ప్రభుత్వం ఆ రెండు కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. సీబీఐ అధికారులు సూరజ్‌ లాకప్‌ డెత్‌కు హిమాచల్‌ప్రదేశ్‌ ఐజీ జహూర్‌ హైదర్‌ జైదీ సహా 8 మంది పోలీసులను నిందితులుగా చేర్చింది.

మిగతా ఏడుగురిలో డీఎస్పీ మనోజ్‌ జోషి, ఎస్సై రాజిందర్‌ సింగ్‌, ఏఎస్సై దీప్‌చంద్‌ శర్మ, హెడ్‌ కానిస్టేబుళ్లు మోహన్‌ లాల్‌, సూరత్‌ సింగ్, రఫీ మహ్మద్‌, కానిస్టేబుల్ రంజిత్‌ సతేరా ఉన్నారు. నిందితుడిగా ఉన్న ఎస్పీ డీడబ్ల్యూ నేగీని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మిగతా ఎనిమిది మందిని దోషులుగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది.