‘నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తే నక్సలైట్లతో కలిసి ఎంతో మందిని గద్దర్ హత్య చేయించారు. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలి’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పద్మ అవార్డులపై సీఎం రేవంత్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంపై స్పందిస్తూ పేర్లను సిఫారసు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చయ్యే సంక్షేమ పథకాలకు ఎవరి పేరు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని పేర్కొంటూ కాంగ్రెస్కు నచ్చితే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకున్నా అభ్యంతరం లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని, అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు.
గత పదేళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా కేంద్రం తెలంగాణకు ఖర్చు చేసిందని బండి సంజయ్ వివరించారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరిగిందని స్పష్టం చేశారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మావోయిస్టు కాదని స్పష్టం చేస్తూ కమ్యూనిస్టు భావజాలం వేరు, మావోయిస్టుగా చేయడం వేరని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తున్న గద్దర్ అవార్డులను మా వోళ్లు తీసుకోరని స్పష్టం చేశారు.
ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. మండలానికి ఒక గ్రామంలోనే నాలుగు పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడం ఏమిటి? అని ప్రశ్నించారు. మిగతా గ్రామాల ప్రజలు కాంగ్రెస్కు ఓట్లేయలేదా? అని మండిపడ్డారు. ప్రజలందరికీ లబ్ధి చేకూరుస్తామని చెప్పి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేయడం ఏమిటంటూ మండిపడ్డారు.

More Stories
స్థానిక ఎన్నికలపై హైకోర్టు కోసం ఎదురుచూపు!
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
హైదరాబాద్ శివార్లల్లో గోసంరక్షకులపై కాల్పులు: