ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, మరో 16 మందిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. 2014లో హనీట్రాప్ కేసులో తనను అన్యాయంగా ఇరికించి ఉద్యోగం నుంచి తొలగించారంటూ ఐఐఎస్‌సీ మాజీ ప్రొఫెసర్ దుర్గప్ప ఆరోపించారు. కులపరమైన విమర్శలతోపాటు బెదిరింపులకు ఎదుర్కొన్నానని చెప్పారు. దీంతో 71వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఆదేశాలతో బెంగళూరులోని సదాశివ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. 
2014లో వారంతా తనను ఓ హనీ ట్రాప్‌ కేసులో ఇరికించారని, అంతేకాకుండా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఫ్యాకల్టీ విధుల నుంచి తనను తొలగించారంటూ దుర్గప్ప పేర్కొన్నారు. అంతే కాకుండా తనను కులం పేరుతో దూషించారని, బెదిరింపులకు పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దుర్గప్ప ఫిర్యాదు మేరకు సదాశివనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.
 
కాగా ఫిర్యాదు చేసిన దుర్గాప్ప గిరిజన బోవి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. 2014 వరకు ఐఐఎస్సీలోని సెంటర్ ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీలో అధ్యాపకుడిగా దుర్గప్ప పనిచేశారు. కాగా క్రిస్​ గోపాల్​కృష్ణన్‌తో పాటు గోవిందన్ రంగరాజన్, శ్రీధర్ వారియర్, సంధ్య విశ్వేశ్వరయ్య, హరి కేవీఎస్, దాసప్ప, బలరాం పి, హేమలతా మిషి, చటోపాధ్యాయ కె, ప్రదీప్ డి సావ్కర్, మనోహరన్ ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. 
 
దీనిపై ఐఐఎస్సీ అధ్యాపకుల నుంచి గానీ, క్రిస్ గోపాలకృష్ణన్ నుంచి గానీ ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్ గోపాలకృష్ణన్ 2011 నుంచి 2014 వరకు ఇన్ఫోసిస్ వైస్ చైర్మన్‌గా, 2007 నుంచి 2011 వరకు ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. 
 
ఆయన 2013-14 సంవత్సరానికి భారత అత్యున్నత పరిశ్రమ ఛాంబర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జనవరి 2014 లో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం కో-చైర్మన్లలో ఒకరిగా పనిచేశారు. 2011 జనవరిలో భారత ప్రభుత్వం గోపాలకృష్ణన్‌ను దేశ 3వ అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్‌తో సత్కరించింది.