
ఉభయ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై చర్చించేందుకు బంగ్లాదేశ్ డిప్యుటీ హైకమిషనర్ నురల్ ఇస్లామ్ ను కేంద్ర విదేశాంగ శాఖ సోమవారం పిలిపించింది. కాగా, 4,156 కిలోమీటర్ల పొడవైన భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఐదు ముఖ్యమైన ప్రదేశాలలో కంచె నిర్మాణానికి భారత్ ప్రయత్నిస్తున్నట్టు బంగ్లాదేశ్ ఇటీవల ఆరోపించింది.
భారత్ -బంగ్లాదేశ్ల మధ్య ఐదు ప్రాంతాల్లో కంచెలు వేయనున్నట్లు హోం వ్యవహారాల సలహాదారు జహంగీర్ ఆలం చౌదరి ఆదివారం మీడియాకు వెల్లడించిన వెంటనే బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు జనవరి 12న నోటీసులు జారీ చేసింది. చారిత్రకంగా భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు సుస్థిరంగా ఉన్నప్పటికీ విద్యార్థుల నిరసనల వల్ల బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశాన్ని వదిలి భారత్లో ఆశ్రయాన్ని పొందిన నాటి నుంచి ఉభయ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిర్మాణాలు ప్రారంభించే ముందు తమను సంప్రదించలేదని, ఇది ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని బంగ్లాదేశ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితిపై చర్చలు జరిపేందుకు భారత రాయబారిని పిలిపించినట్లు ప్రకటించింది. ప్రణరు వర్మ ఆదివారం విదేశాంగ శాఖ కార్యాలయానికి చేరుకని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంపై భారత్ కూడా తగు చర్యలు తీసుకుంది. బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ నురల్ ఇస్లామ్కు విదేశాంగ శాఖ నోటీసులు ఇచ్చింది. గతేడాది ఆగస్ట్ 5న షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన అనంతరం హసీనా పార్టీ అవామీ లీగ్ సభ్యులు, బంగ్లాదేశ్ ప్రజలు సరిహద్దుల్లో నుండి భారత్ భూభాగంలోకి చొరబడుతున్నారు.
దీంతో భారత ప్రభుత్వం సరిహద్దు భద్రతపై దృష్టి సారించింది. 2024 ఆగస్ట్ చివరలో మేఘాలయలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో అవామీ లీగ్ నేత ఇష్ఫాక్ అలీ ఖాన్ పన్నా మృతదేహాన్ని గుర్తించిన సంగతి తెలిసిందే. రాజకీయ ప్రత్యర్థులు ఆయనను వెంబడించి హత్య చేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేశారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు