
మల్లికార్జునరావు రాంపల్లి,
సంపాదకులు, నవయుగ భారతి ప్రచురణలు
1857 స్వరాజ్య సంగ్రామం తర్వాత దేశంలో జాతి పునర్నిర్మాణానికి క్రమంగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ ప్రయత్నాలలో భాగంగా 1875 ఏప్రిల్ 19న దయానంద సరస్వతి ఆర్య సమాజ్ ను ప్రారంభించారు. ఆ తదుపరి 1897 మే 1న వివేకానందుడు కలకత్తాలో రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేశారు. అట్లాగే 1925 విజయదశమి పండుగ రోజున డాక్టర్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభించారు. ఈ రకంగా ఒక క్రమ పద్ధతిలో 1875 నుండి 1925 వరకు దయానంద సరస్వతి, వివేకానందుడు డాక్టర్ హెడ్గేవార్ హిందూ ససమాజంలో క్రమంగా వారి వారి పనులు చేసుకుంటూ వచ్చారు.
వీరిలో మొట్టమొదటిసారిగా హైందవ శంఖారావం పూరించి నటువంటి వారు వివేకానందుడు. ఆర్య సమాజ్ ప్రారంభ మైన 22 సంవత్సరాలకు రామకృష్ణ మిషన్ ప్రారంభమైనది,రామకృష్ణ మిషన్ ప్రారంభమైన 28 సంవత్సరాలకు రాష్ట్రీయస్వయంసేవకసంఘం ప్రారంభమైంది. అది మన జాతి పునర్నిర్మాణo క్రమవికాశం. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ తరువాత దేశంలో జాతీయ స్థాయిలో మరే సామాజిక సంస్థ ప్రారంభం కాలేదు.
స్వామి వివేకానందుడులో చిన్న వయసు నుండి భగవంతుని దర్శించాలని కోరిక చాలా తీవ్రంగా ఉండేది. అది వయస్సుతో పెరుగుతూ చివరకు రామకృష్ణ పరమహంస దగ్గరకు చేర్చింది. 1882 జనవరిలో నరేంద్రుడు దక్షిణేశ్వరం వెళ్లి రామకృష్ణ పరమహంసని కలిశారు. ఆ కలయిక ఈ దేశ చరిత్ర గతిని మారుస్తుందని ఆనాడు ఎవరు ఊహించి ఉండరు. 1884 నుండి నరేంద్రుడు రామకృష్ణ పరమహంస అత్యంత సన్నిహితంగా గడిపారు .
ఆ అనుభాలు వివేకానందుని మాటల్లో ’’రామకృష్ణ పరమహంస నన్ను కాళీమాతకు అప్పగించారు. దానితో తన జీవనకార్యం పూర్తయినట్లుగా రామకృష్ణ పరమహంస భావించారు’’. ఆశ్చ్యర్యం ఏమిటంటే రామకృష్ణ పరమహంస దాని తర్వాత జీవించింది కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే. స్వామి వివేకానంద 1889 డిసెంబర్ లో మఠాన్ని వదిలి దేశ పర్యటనకు బయలుదేరారు. ఆ పర్యటన చివరి అంకం 1892.
1892 డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో ఈ రోజున కన్యాకుమారిలో ఉన్న వివేకానంద శిలాస్మారకం ఉన్న శిలపైన స్వామి వివేకానంద మూడు రోజులు అంతర్ముఖులై దేశ పరిస్థితులలో తన జీవన కార్యము నిర్ణయించుకున్నారు. ఆ సమయంలోనే చికాగోలో జరిగే ప్రపంచ మత మహాసమ్మేళనంలో పాల్గొనాలని ఆదేశం వివేకానందనికి అందింది. తన 30 సంవత్సరాల వయస్సులో చికాగోలో ప్రపంచ మత మహాసమ్మేళనంలో పాల్గొని ప్రసంగించి ప్రపంచంమంతా పరిచయమయ్యారు.
1857 స్వాతంత్ర్య సంగ్రామం తరువాత భారత దేశం శతాబ్దాల సంఘర్షణ కల్లోలాల నుండి కొంత శాంతి నెలకొన్నది అనే భావన వచ్చింది. కొద్దిగా విరామం దొరికింది. అదీ కొంతకాలమే. ఆ సమయం దేశం తేరుకోవడానికి ఉపయోగపడింది అని చెప్పవచ్చు. ఆ తదుపరి క్రమంగా స్వాతంత్రం కోసం భీషణ సంగ్రామం కొనసాగించేoదుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అట్లాగే దేశం లోని .అన్ని రంగాలలో పనులు క్రమంగా ప్రారంభమైనాయి.
ఆ సమయంలో మనదేశంలో అనేకమంది ఆంగ్ల విద్య చదువుకొని ఆంగ్లేయుల కొలువులలో పనిచేస్తూ పాశ్చాత్యదేశాలను అధ్యయనం చేయటానికి ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. ప్రారంభంలో ఆంగ్లేయ సంస్కృతి చాలా గొప్పది అనే భావనలో పడ్డారు. అధ్యయనం కొనసాగించిన తర్వాత వాళ్ళకు అర్థం అయింది మన సంస్కృతి గొప్పతనం. దాంతో పాశ్చాత్య నాగరికతతో సంఘర్షణ చేసేందుకు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విషయాల గొప్పతనాన్ని బయటకు తీసుకొచ్చేందుకు విశేష ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
ఆ సంగ్రామం రెండు నాగరికతల మధ్య సంగ్రామానికి తెరలేపింది. దీనికి సంబంధించిన విషయాలను ప్రముఖ చరిత్రకారుడు కె.ఎమ్ పణిక్కర్ మాటలలో చూద్దాం. ”అధిక శక్తి సంపన్నమైన, విస్తరిస్తున్న, చైతన్యవంతంగా కనబడుతున్న పాశ్చాత్య నాగరికత, ప్రాచీనమైన క్షీణ దశలో స్తబ్దంగా ఉన్నట్లు కనపడుతున్నా భారతీయ నాగరికత జీవన విధానానికి సంఘర్షణ ప్రారంభమైంది. ఈ సమయంలో మనం నిలదొక్కుకోలేక పోతే 14వ శతాబ్దంలో జరిగిన పరిణామాలు మళ్ళీ తిరిగి దేశంలో చోటుచేసుకుంటాయా అనే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ పరిస్థితిలో ప్రపంచానికి మనం ఏమి ఇవ్వలేని దుస్థితి తలెత్తే ప్రమాద సంకేతాలు కనబడుతున్న సమయంలో 19వ శతాబ్దం చివరి భాగంలో వివేకానంద వాణి ఉవ్వెత్తున లేచింది,. దానికి కీలక ఘట్టం 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మత మహా సమ్మేళనం. ఆ సమ్మేళనంలో మొదటి రోజు వివేకానంద వాణి ఒక సింహగర్జన, ఆ గర్జనకు ప్రపంచమంతా ఒక్కసారి ఉలిక్కి పడింది. అదే ఆ తదుపరి అనేక కీలక పరిణామాలు దారి తీసింది”.
1893 ప్రపంచ మత మహా సమ్మేళనం తరువాత వివేకానందుడు 4 సంవత్సరాలపాటు అమెరికా, ఐరోపా దేశాలలో పర్యటన చేసి 1897 జనవరి 15న కొలంబో చేరుకున్నారు. అక్కడి నుండి 6 నెలలపాటు దేశమంతా ఒక తూఫాన్ పర్యటన చేశారు. ఆ పర్యటనలో వివేకానంద హిందూ సమాజాన్ని జాగృతం చేసేందుకు విశేష కృషి చేశారు. 6 నెలలు పాటు చేసిన దేశ పర్యటనలోనే స్వామి వివేకానంద హైందవ శంఖారావం పూరించారు.
ఈ విషయాన్ని సోదరి నివేదిక రాసిన ‘’THE MASTAR I SAW HIM’’ అనే పుస్తకంలో వివేకానందుని జీవన కార్యము వివరిస్తూ ‘’హిందూత్వాన్ని సమరశీలమైనదిగా చేయాలని, ఈ దేశాన్ని పూర్వ వైభవ స్థితికి తీసుకుని వెళ్లాలని వివేకానంద చెప్పారు. త్యాగం సేవా భావం యుగయుగాలుగా ఈ దేశ లక్షణాలు. వ్యక్తి నిర్మాణం అనేది అత్యవసరమైన కార్యమని ప్రకటించారు. హిందూ భావ జాగరణ కు వివేకానందుడు చేసిన కృషి చాలా విశేషమైనది. మనం హిందువు లమైనందుకు గర్వపడాలని చెప్పారు”.
“ఈ దేశపు నిరుపేద హృదయాలను చూసి వారిని సేవించాలని పిలుపిచ్చారు. అందుకే మానవసేవే మాధవసేవ అన్న భావాన్ని వ్యాప్తి చేశారు. మనుష్యులను తయారు చేయటం నా జీవన కార్యము. భారతదేశం తొలుత రాజకీయ స్వేచ్ఛ సాధించవలసి ఉన్నదని అంటే స్వాతంత్రం సాధించాలి అని చెప్పారు. సంఘటితంగా పనిచేసే విధానం మన స్వభావంలో బొత్తిగా లేనే లేదని చెప్పారు. ఈర్ష అసూయలు లేకుండా ఉండటమే గొప్ప విజయ రహస్యం అని చెప్పారు. నీతో పాటు పని చేసే సోదర కార్యకర్తల అభిప్రాయాలకు తలఒగ్గటానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండు వారితో సమన్వయం సాధించడానికి ప్రయత్నించు దానికి మించిన రహస్యం లేదు అని చెప్పారు”.
జాతీయ మహాకవి సుబ్రహ్మణ్య భారతి మాటల్లో వివేకానందుడు హిందూ ధర్మ పునరుద్ధరణ కార్యానికి శుభారంభం చేశారు అని చెప్పారు. సాంఘిక న్యాయం సమానత్వం అనే పునాదుల పైన సామాజిక వ్యవస్థను పునర్నిర్మించాలని, అప్పుడే మన సంస్కృతి వారసత్వానికి తగిన విధంగా భారతదేశం రూపుదిద్దుకోగలదని చెప్పి దేశభక్తి భావనలను మేల్కొల్చిన వారు స్వామి వివేకానంద అని మొరార్జీ దేశాయి చెప్పారు.
ధర్మమే ఈ దేశం ఆత్మ
మంచికో చెడుకో వేల సంవత్సరాలుగా హిందూ దేశంలో ధార్మికత ఆదర్శమై నిలిచింది. హిందూ దేశ వాతావరణo ధార్మిక ఆదర్శాలతో నిండి ఉంది. ధార్మిక భావన మన రక్తంలో ప్రవేశించి మన రక్తనాళాలలో ప్రతి బిందువుతోను మిళితమై మన స్వభావంలో భాగమై మన జీవితానికి జవము జీవమై అలరారుతున్నం, ఈ ధార్మిక భావనల మధ్య మనం పుట్టి పెరుగుతున్నాం.
గంగానది ప్రవాహం వెనుకకు మళ్ళింపబడవచ్చు నేమో కానీ ఈ దేశానికి లక్షణమైన ధార్మిక జీవన పథాన్ని విడిచిపెట్టి రాజకీయము మరొకటో కొత్త దారి వెతకటం మాత్రం అసాధ్యం. ధార్మిక జాగరణే హిందూ దేశానికి సులభమైన మార్గం, మనుగడకు అభివృద్ధికి , సంక్షేమ సాధనకు ఇదే సరైన మార్గం. ఈ దేశ ఆత్మ ధర్మంలో ఉన్నది దానిని ఎవ్వరూ విధ్వంసం చేయజాలనందునే హిందూ రాష్ట్రం ఎన్నో అఘాతాలను తట్టుకుని ఇంకా సజీవంగా నిలబడి ఉంది.
జాతీయత విషయంలో స్వామి వివేకానందుని దృక్పథంలో సంస్కృతి ప్రధానమైనది, ప్రపంచంలో ప్రతి జాతి, దేశం తనదైన గతంతో విశిష్టత వ్యక్తిత్వంతో జన్మిస్తుంది. జాతులు అనే స్వర సమ్మేళనంలో ఒక్కొక్క జాతి ఒక్కొక్క ప్రత్యేక స్వరానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, అదే ఆ జాతి కి జీవం ప్రాణం ప్రాణశక్తి అని చెప్పారు.19వ శతాబ్దపు ద్వితీయార్ధంలో ఐరోపాలోనూ, ఆ పిమ్మట ప్రపంచంలోని ఇతర దేశాలలోనూ జాతీయవాదం ఒక సిద్ధాంతంగా సామ్యవాదంతో పోటీపడి చాలా సందర్భాలలో తన బలం నిరూపించుకుంది.
జాతీయవాద ఉద్యమాలు ప్రజలను ఆకర్షించి ప్రముఖమైన రాజకీయ పరిణామాలకు దారి తీసింది. దీన్నిబట్టి మనకు అర్థమయ్యే విషయం పాశ్చాత్య దేశాలలో జాతీయవాదం అనేది ఒక వ్యతిరేక త్మక భావన నుండే అది పుట్టుకొచ్చింది. దానికి మన దేశంలో నిర్వహించే జాతి జాతీయతకు ఎటువంటి సంబంధం లేదు. మనదేశంలో చెప్పబడే జాతీయత సకారాత్మక మైనది. వ్యతిరేకత నుండి పుట్టుకొచ్చినది కాదు.
జాతికి ఇక్కడ మూలాధారం దేశం, ధర్మం, సంస్కృతి. ఇవి పాశ్చాత్య దేశాలలో మనకు కనపడవు. ఈ విషయంలో స్వతంత్రం సిద్దించి 78 సంవత్సరాలైన మన జాతీయత విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఆ స్పష్టత వచ్చినప్పుడే మనం అనే భావన నిర్మాణమవుతుంది. అప్పుడే మనం హిదువులం బంధువులం అనే భావం సర్వత్రా వెల్లివిరుస్తుంది. దీనికి సంబంధిన విషయాలు తెలుసుకోవాలంటే వివేకానందుని ”మన మాతృభూమి” వ్యాసం చదవాలి.
ఒక హిందువు ఆధ్యాత్మికత లోపించిన వాడైతే అతడిని హిందువు అని చెప్పగలమా? ఇతర దేశాలలో మనుషులకు అత్యంత ఇష్టమైన విషయం రాజకీయాలు కావచ్చు. ఆ తర్వాత అతనికి మత ధార్మిక విషయాలపై కొద్దిగా ఆసక్తి ఉండవచ్చు. కానీ మనం ఇక్కడ హిందూదేశంలో మనందరికీ ప్రథమ కర్తవ్యం ఆధ్యాత్మిక చింతనతో కూడిన జీవనం.
ఆధ్యాత్మిక శక్తులన్నిటిని చైతన్యం చేయాలని, అదే హిందూ దేశం జాతీయత, జాతీయ సమైక్యత అని చెప్పారు. మన జాతీయత, జీవనం ధర్మాన్ని ఆశ్రయించి ఉంది. మనకు ధర్మం తర్వాతే మిగిలిన విషయాలు అని చెప్పారు స్వామి వివేకానంద. త్యాగము, సేవ భావము- ఈ రెండు యుగయుగాలుగా మనకు పరమ ఆదర్శాలని స్వామి చెప్పేవారు. వ్యక్తి నిర్మాణం, శీల నిర్మాణం అనుశాసనం సంఘటనాత్మకత తక్షణ అవసరాలని కూడా చెప్పారు.
అన్నిటికంటే ముందు నేర్చుకోవాల్సింది, ఆవశ్యకమైనది నిస్వార్థులు అంకిత భావం కలిగినవారినైనా యువ కార్యకర్తల బృందాలను ఏర్పరచుకోవడం. ఆ దిశలో ఆయన ప్రయత్నాలు ఆరంభించి ఆయన ఇచ్చిన పిలుపు. “నేను హిందువునైనానoదుకు గర్విస్తున్నాను. పరమాత్మని దయతో నా దేశవాసులారా మీరు వాటిని ఆత్మాభిమానంతో గర్వము కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. మీ పూర్వీకుల పట్ల మీకున్న విశ్వాసం మీ రక్తంలో పొంగులు ఎత్తాలి . అది మీ జీవితాలకు జవసత్వాలను అందజేయాలి. అది ప్రపంచo మీచే పని చేయించాలి అని నేను కోరుకుంటున్నాను”.
దేశానికి కేంద్ర బిందువు హిందుత్వం
పాశ్చాత్య దేశాల భౌతిక వాదానికి సవాలుగా హిందూ ధర్మ పతాకాన్ని మొట్టమొదటిగా ఆవిష్కరించింది స్వామి వివేకానంద. ఈ విషయంలో ఎవరికీ సందేహం లేదు. మన దేశ సరిహద్దులను దాటి దేశ దేశాలలో హిందూ ధర్మ వైభవాన్ని చాటిచెప్పే భారాన్ని భుజాన్ని ఎత్తుకున్నది కూడా వివేకానంద స్వామియే. ఆయన తనలో ఉన్న వేధాశక్తి, వైదుష్యము, సరళంగా వివరించే గుణము, సమ్మెహమైన వకృత్వ పటిమ, అమితమైన ఉత్సాహము, అంతరిక మైన శక్తి -వీటన్నిటిని వినియోగించి ఈ పనికి ఒక పటిష్టమైన పునాది వేశారు.
12 శతాబ్దాల కిందట ధర్మం పవిత్రమైనదే కాక అది మనకు శక్తి శ్రోతస్సు గొప్ప సంపద అని తెలియచెప్పి దానిని యావత్ ప్రపంచంలో చాటించబడటం మన పవిత్ర కర్తవ్యం అని చెప్పి దాని ఆచరణలో పెట్టి చూపిన వ్యక్తి శంకరాచార్యులు ఒక్కరే. 19 శతాబ్దం చివరి దశాబ్దంలో రంగ ప్రవేశం చేసిన స్వామి వివేకానంద కూడా ఆ స్థాయి వ్యక్తే. స్వామీజీ వేసిన ఈ పునాదిపై ఒక భవ్యమైన వేదిక నిర్మాణం అవుతుందని దిగ్విజయాన్ని సాధించి మకుటాన్ని శిరస్సుపై ధరించి స్వామిజి ఆ వేదికను అలంకరిస్తారని ఎంతో ఆశావిశ్వాసం ఉండేవి.
అయితే ఆయన చిన్న వయసులోనే మహాసమాధిని పొందారు. స్వామిజీ తలపెట్టిన కార్యం అసంపూర్ణంగా ఉంది. ఆయన శిష్య బృందం ద్వారా గాని మరెవరి ద్వారా నైనా గాని అది పరిపూర్ణం కావాల్సింది. ఆ పనిలో గడచిన వంద సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సమాజం లోని అన్నిరంగలలో పనిచేస్తున్నది. హిందుత్వం ఈ రోజు దేశానికి కేంద్ర బిందువు మారింది.
ప్రపంచ శాంతికి మార్గం సుగమం
చికాగో ఉపన్యాసం తర్వాత నాలుగు సంవత్సరాలపాటు ప్రపంచంలోని అనేక దేశాలు తిరిగి ప్రపంచ శాంతికి ఆధ్యాత్మిక జ్ఞానమే ఏకైక మార్గం అనే ఆలోచనను రేకెత్తించాడు స్వామి వివేకానంద. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత శ్రీలంక లోని కొలంబో నుండి హిమాలయాలలో ఉన్న ఆల్మరా వరకు పర్యటన చేసారు. ఈ రకంగా స్వామి వివేకానంద చేసినటువంటి బాటలో స్వామి రామతీర్థం అనేకమంది ప్రపంచంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తరింప చేసేందుకు తీవ్రమైన కృషి అప్పటినుండే ప్రారంభించారు.
మన దేశం నుండి ఈ రోజు ప్రపంచం మొత్తం తిరిగేటువంటి అనేకమంది సాధుసంతులు మనకు కనపడుతూ ఉంటారు. వారందరూ ఒక ప్రక్క మన సమాజంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందిస్తూ సామాజిక సమస్యల పరిష్కారానికి తమ వంతు బాధ్యతలను నిర్వర్తిస్తూ అనేక సేవా కార్యక్రమాలను పాఠశాలలను ఇట్లా అనేక సామాజిక కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉన్నారు. మరొక ప్రక్క ప్రపంచం మొత్తం తిరుగుతూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందిస్తున్నారు.
2000 సంవత్సరం కొత్తమిలీనియం ప్రారంభంలో కోఫీ అన్నన్ నిర్వహించిన ప్రపంచ మత మహాసమ్మేళనం ఒక తిరుగులేనిది. ఆ సమయంలో ప్రపంచ శాంతికి భారతీయుడు నడుం కట్టాలని ఆ సమావేశంలో పాల్గొన్న పెద్దలు అందరూ కూడా పిలుపునిచ్చారు. అది మన బాధ్యత, ఆ బాధ్యతను నిర్వర్తించడానికి మన దేశం కృషి చేయాలి. వందల సంవత్సరాల తరువాత దేశం ప్రపంచంలో ఆధ్యాత్మిక శక్తి ఎట్లా పెరుగుతుందో మనం చూస్తున్నాము. దానికి పునాది వేసిన వేసినటువంటి వారు స్వామి వివేకానంద. వివేకానందుడు ప్రపంచశాంతికి కావలసిన బాటను ఒక మహా రహదారిగా నిర్మాణం చేసి మార్గాన్ని సుగమం చేసినటువంటి వారు. అటువంటి మహా పురుషులు భారత దేశంలో అరుదుగా జన్మిస్తూ ఉంటారు. అదే ఈ దేశం విశిష్టత.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము