
బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసీటీ) ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాపై మరోసారి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినందుకు గానూ ఆమెతో పాటు మరో 12 మందికి ఈ వారెంట్ జారీ చేసింది. హసీనా రక్షణ సలహాదారు మేజర్ జనరల్ (రిటైర్డ్) తారిక్ అహ్మద్ సిద్ధిఖీ, మాజీ ఐజీ బెనజీర్ అహ్మద్, మాజీ నేషనల్ టెలికమ్యూనికేషన్ మానిటరింగ్ సెంటర్ డీజీ జియావుల్ అహ్సాన్ వంటి వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. వీరందరినీ ఫిబ్రవరి 12వ తేదీలోపు కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని ఆదేశించింది.
కాగా, హసీనా దేశం విడిచి భారత్కు వెళ్లిపోయిన నాటి నుంచి ఆమెపై జారీ అయిన రెండో వారెంట్ ఇది. తొలి వారెంట్ గతేడాది అక్టోబర్ 17న జారీ అయిన విషయం తెలిసిందే. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినందుకు ఆమెతో పాటు మరో 45 మందిపై ట్రిబ్యునల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
వారెంట్లు జారీ అయిన వారిలో హసీనా పార్టీ అవామీ లీగ్ అగ్ర నేతలు ఉన్నారు. వీరందరినీ నవంబర్ 18లోగా తమ ముందు హాజరు పరచాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే, ఆ ఆదేశాలు అమలు కాలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఉధృతం కావడంతో ఆగస్టు 5న హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే.
మాజీ ప్రధాని షేక్ హసీనా అరెస్ట్కు సహాయం చేయాలంటూ ఇంటర్ పోల్ను సైతం బంగ్లాదేశ్ ఆశ్రయించింది. మరోవైపు ఆమెకు తమకు అప్పగించాలంటూ భారత్ను ఇప్పటికే బంగ్లాదేశ్ పలుమార్లు విజ్ఞప్తి చేసిన విషయం విధితమే.
గతేడాది జూలై, ఆగస్ట్ మాసాల మధ్య బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల సంస్కరణలకు దేశవ్యాప్తంగా విద్యార్థులు పిలుపునిచ్చారు. దేశ ప్రజలు సైతం దీనికి మద్దతు తెలిపారు. ఆ క్రమంలో చెలరేగిన హింసలో 600 మందికి పైగా మరణించారు.ఈ నేపథ్యంలో నాటి షేక్ హసీనా ప్రభుత్వంలో కీలక వ్యవహరించిన వారిపై సైతం కేసులు నమోదయ్యాయి.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా