
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అద్భుత విజయాలు సాధిస్తోంది. గత నెల 30న ప్రయోగించిన పీఎస్4-ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ (పీఓఈఎం)లో బొబ్బర గింజలు (కౌపీ సీడ్స్) మొలకెత్తాయి. ఈ మిషన్లో ఇస్రో పంపిన అలసంద విత్తనాలు (బొబ్బర్లు) తాజాగా మొలకెత్తాయి. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో నాలుగు రోజుల్లోనే ఇవి మొలకెత్తడం విశేషం. వీటికి ఆకులు కూడా మరికొద్ది రోజుల్లో రావచ్చునని ఆశిస్తున్నారు.
దాదాపు శూన్య గురుత్వాకర్షణ స్థితిలో, అంతరిక్ష పరిసరాల్లో జీవం మొలకెత్తడం భారత దేశానికి ఇదే మొదటిసారి. ఈ వివరాలను ఇస్రో వెల్లడించింది. పీఓఈఎం గత నెల 30న ఇస్రో ప్రయోగించిన స్పేడెక్స్లో భాగం. ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ మాట్లాడుతూ, భారతీయ స్పేస్ ల్యాబ్లో జీవి మొలకెత్తడం చాలా ఉత్తేజితంగా ఉందని తెలిపారు.
అంతరిక్షంలో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ కోసం ఉద్దేశించిన స్పేడెక్స్ ప్రయోగంలో పీఎస్ఎల్వీ-సి60 రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. నాలుగో దశ (పోయెమ్-4)ను ఉపయోగించుకొని 24 పేలోడ్లను రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపింది. ఇందులో కంపాక్ట్ రిసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ (క్రాప్స్) అనే సాధనం కూడా ఉంది.
క్రాప్స్2ను తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (వీఎస్ఎస్సీ) అభివృద్ధి చేసింది. ఇందులో ఎనిమిది అలసంద విత్తనాలను ఉంచారు. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల ఎదుగుదలపై అధ్యయనంలో భాగంగా వీటిని అంతరిక్షంలోని ఇస్రో పంపింది. భవిష్యత్లో చేపట్టబోయే సుదీర్ఘ రోదసీ ప్రయాణాలకు ఇది చాలా కీలకం.
తమ ఆహారాన్ని వ్యోమగాములు అంతరిక్షంలోనే పండించుకోవాల్సి ఉంటుంది. విత్తనాలు మొలకెత్తి, రెండు ఆకుల దశకు చేరుకునేవరకూ కొనసాగేలా ‘క్రాప్స్’ రూపొందించారు.ఈ విత్తనాలను ఒక పెట్టెలో ఉంచి ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియను పరిశీలించేందుకు అందులో కెమెరాను ఉంచారు. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వాయువుల గాఢతను కొలవడం, నేల తేమ పర్యవేక్షణకు కూడా ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి.
ఇక, స్పేడెక్స్ అంతరిక్షం నుంచి భూమిని తొలిసారి వీడియో తీసింది. శక్తివంతమైన మహాసముద్రాలు, తిరుగుతోన్న మేఘాలతో అత్యద్భుతంగా ఉన్న ఈ వీడియోను ఇస్రో ఎక్స్ (ట్బిట్టర్)లో షేర్ చేసింది. ప్రస్తుతం 400 కి.మీ. ఎత్తులో ఉన్న ఉపగ్రహం అక్కడ నుంచి భూమి వీడియో తీసింది.
ఇదిలా ఉండగా మంగళవారం (జనవరి 7న) అత్యంత కీలకమైన దశను శాస్త్రవేత్తలు పూర్తిచేయనున్నారు. ఆ రోజున రెండు ఉపగ్రహాలను రోదసీలోనే అనుసంధానం చేస్తారు. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇటువంటి అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉండగా, తాజాగా భారత్ వాటి సరసన చేరింది.
More Stories
శబరిమలద్వారపాలక విగ్రహాలపై బంగారు-రాగి తాపడాలు
అహ్మదాబాద్ లో 2030 కామన్వెల్త్ గేమ్స్
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కు సుప్రీంకోర్టు అనుమతి