ఏపీకి కేంద్రం 10 చేనేత క్లస్టర్లు మంజూరు

ఏపీకి కేంద్రం 10 చేనేత క్లస్టర్లు మంజూరు

ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా 10 చేనేత క్లస్టర్లను కేంద్రం మంజూరు చేసింది. చేనేత కార్మికుల్ని ప్రోత్సహిస్తూ, కొత్త డిజైన్ల ద్వారా ఆదాయం పెంచందుకు కేంద్రం క్లస్టర్ల కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు ఏపీలోని కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, శ్రీసత్యసాయి, అనంతపురం ఒక్కొక్కటి, తిరుపతి జిల్లాలో మాత్రం రెండు క్లస్టర్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. 

అంతేకాదు పల్నాడు, గుంటూరు, బాపట్ల, తిరుపతి పరిధిలో క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించి తొలి అడుగు కూడా పడింది. ఈ క్లస్టర్ల కోసం తొలి విడతగా రూ.5 కోట్లు విడుదలయ్యాయి. మిగిలినవాటికి మరో రూ.2 కోట్ల మంజూరుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధులు 10 రోజుల్లో రాష్ట్రానికి జమకానున్నాయి. సంక్రాంతి నాటికి క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించి పనులు ప్రారంభించనున్నారు. ఈ క్లస్టర్ల ఏర్పాటుతో 2 వేలమంది చేనేతలకు లబ్ధి కలుగుతుందని చెబుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చేనేత, అనుబంధ రంగాలకు చెందిన 3.50 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 క్లస్టర్లు ఉంట చేనేత కార్మికుల్ని 100 నుంచి 500 మంది ప్రాతిపదికగా క్లస్టర్ ఏర్పాటు చేస్తారు. ఒక్కో క్లస్టర్‌‌లో కార్మికుల సంఖ్యను బట్టి కేంద్రం నుంచి ఒక్కో క్లస్టర్‌కు రూ.2కోట్లు మంజూరయ్యే అవకాశం ఉంది. 

కేంద్రం విడుదల చేసే ఈ నిధులతో క్లస్టర్‌ పరిధిలోని కార్మికులకు 90% రాయితీతో చేనేతలకు అవసరమైన ఆధునిక యంత్రాలు రూ.15-70 వేల విలువైనవి అందజేస్తారు. లబ్ధిదారులు 10శాతం చెల్లిస్తే సరిపోతుంది. అంతేకాదు 100% రాయితీతో వ్యక్తిగత వర్క్‌షెడ్డును కూడా నిర్మిస్తారు.  మరోవైపు చేనేత కార్మికులకు నూతన డిజైన్లపై శిక్షణ ఇచ్చేందుకు డిజైనర్‌ కూడా క్లస్టర్‌టలో అందుబాటులో ఉంటారు. 

అలాగే కేంద్రం అవసరమైన పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు క్లస్టర్‌ డెవలప్‌ ఎగ్జిక్యూటివ్‌ను నియమిస్తుంది. రాష్ట్రంలో ధర్మవరం చేనేత రంగంలో కీలకమైన ప్రాంతం అని చెప్పాలి. అక్కడ చేనేతలు కంచిపట్టు చీరల్ని తయారు చేస్తారు.. ఇవి ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తారు. ఈ మేరకు ధర్మవరం చేనేతల్ని ప్రోత్సహించేందుకు రూ.34 కోట్లతో మెగా క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు డీపీఆర్‌ను కూడా రూపొందిస్తున్నారు. 

అలాగే పిఠాపురం, అంగరలో కూడా రూ.14 కోట్లతో మెగా క్లస్టర్ల ఏర్పాటు కోసం సర్వే చేస్తున్నారు. వీటిని ఏర్పాటు చేసేందుకు కేంద్రం 90శాతం నిధులు మంజూర చేయనుంది.. రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 10 శాతం భరించనుంది. కేంద్రానికి డీపీఆర్‌లు పంపించిన తర్వాత నిధులు విడుదల చేస్తారు. మొత్తానికి ఈ క్లస్టర్లతో ఆయా జిల్లాలకు మహర్దశ అని చెప్పాలి.