కేజ్రీవాల్ పై బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ పర్వేశ్‌వర్మ

కేజ్రీవాల్ పై బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ పర్వేశ్‌వర్మ

* 29 మంది అభ్యర్థులతో ఢిల్లీ బీజేపీ మొదటి జాబితా

దేశ రాజధాని డిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్‌ ప్రకటించనప్పటికీ రాజకీయ వేడి మాత్రం రాజుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఆప్ తమ అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా బీజేపీ డిల్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. 

న్యూడిల్లీ స్థానంలో ఆప్‌ జాతీయ కన్వీనర్‌, మాజీ సీఎం కేజ్రీవాల్‌కు పోటీగా మాజీ ఎంపీ పర్వేశ్‌వర్మని బీజేపీ బరిలో దింపింది. తొలి జాబితాలో 29 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే కాంగ్రెస్‌ కూడా ఈ స్థానానికి మాజీ సీఎం షీలాదీక్షిత్‌ కుమారుడు సందీప్‌ దీక్షిత్‌ పేరును ప్రకటించింది. దీంతో ఈసారి ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గ పోరు ఆసక్తికరంగా మారింది.

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌ సింగ్ వర్మ కుమారుడైన పర్వేశ్‌ వర్మ 2014 నుంచి 2024 వరకు పశ్చిమ డిల్లీ నుంచి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈయన రికార్డు స్థాయిలో 5.78 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. డిల్లీ చరిత్రలో ఓ లోక్‌సభ అభ్యర్థి సాధించిన అత్యధిక మెజార్టీ ఇదే కావడం విశేషం.

ఇక, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీకి పోటీగా కల్కాజీ స్థానం నుంచి మరో మాజీ ఎంపీ రమేశ్‌ బిధూడీని బిజెపి నిలబెట్టింది. ఇటీవలే ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి కైలాశ్‌ గహ్లోత్‌కు ఈ ఎన్నికల్లో టికెట్‌ దక్కింది. బిజ్వాసన్‌ నుంచి ఆయన పోటీ చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. డిల్లీ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ అరవింద్‌ సింగ్లీ లవ్లీ కూడా గతేడాది కమలదళంలో చేరగా, తాజా జాబితాలో గాంధీనగర్‌ స్థానం నుంచి నిలబెట్టింది.
 
ఢిల్లీలో మొత్తం 7 లోక్ సభ స్థానాలను 2014 నుండి గెలుస్తూ వస్తున్న బిజెపి గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్యెల్యేలలో రెండంకెలను కూడా చేరుకోలేక పోతుంది. అందుకనే ఈ సారి గెలుపే లక్ష్యంగా గెలుపు అవకాశం గల అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థులలో కనీసం ఇటీవల ఆప్, కాంగ్రెస్ పార్టీల నుండి బీజేపీలో చేరిన ప్రముఖ నాయకులు కావడం గమనార్హం. 
 
70 శాసనసభ స్థానాలు ఉన్న ఢిల్లీ ప్రస్తుత అసెంబ్లీ గడువు ఈ ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. మరికొన్ని రోజుల్లో ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్‌ కూడా కొంతమందిని ప్రకటించింది.