కావాలనుకుంటే అద్దాల మేడ క‌ట్టుకునేవాడిని

కావాలనుకుంటే అద్దాల మేడ క‌ట్టుకునేవాడిని
దేశ రాజధానిలోని 4 కోట్ల మంది ప్రజలకు నివాస గృహాలు కల్పించడం ద్వారా సొంతింటి కలను తాము సాకారం చేశామని, తన కోసం ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేదని, తాను కూడా కావాలనుకుంటే అద్దాలమేడ  (‘శీష్ మహల్’) కట్టుకునేవాడిని అంటూ  ప్రధాని నరేంద్ర మోదీ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 
 
ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో కేజ్రీవాల్ నివసించిన విలాసవంతమైన భవనం ‘శీష్ మహల్’ కొద్దికాలంగా వార్తల్లో ప్రముఖంగా ఉండటం గమనార్హం.
ఇటీవ‌ల నిర్మించిన ఢిల్లీ సీఎం నివాసం కోసం భారీ మొత్తంలో ఖ‌రీదైన వ‌స్తువుల‌ను వాడారు. దానిపై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ప‌బ్లిక్ వ‌ర్క్స్ శాఖ రిలీజ్ చేసిన ఇన్వెంట‌రీలో విస్తుపోయే లెక్క‌లు ఉన్నాయి. 
 
సీఎం బంగ్లా కోసం చాలా హైఎండ్ ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల్ని వాడిన‌ట్లు ఉన్న‌ది. దీంతో బీజేపీ, ఆమ్ ఆద్మీ మ‌ధ్య రాజ‌కీయ వేడి చెల‌రేగింది.  అశోక్ విహార్ రామ్‌లీలా గ్రౌండ్స్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారతదేశం ఈరోజు రాజకీయ, ఆర్థిక సుస్థిరతకు ఒక నిదర్శనంగా నిలిచిందని చెప్పారు.  2025లోనూ ప్రపంచ దేశాల్లో భారతదేశ స్థానం మరింత బలపడనుందని భరోసా వ్యక్తం చేశారు.
 
 ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాల్లో ఒకటిగా ఈ ఏడాది భారతదేశం నిలువనుందని స్పష్టం చేశారు. ఈరోజు ఢిల్లీకి గుర్తుండిపోయే రోజని, గృహ, మౌలిక వసతుల, విద్యారంగాల్లో గుణాత్మక మార్పులు తెచ్చే ప్రాజెక్టులతో సిటీ అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. గ‌త ప‌దేళ్ల నుంచి ఢిల్లీని ఆప‌ద చుట్టేసింద‌ని, అన్నాహ‌జారేను ముందు పెట్టి, కొంద‌రు నిజాయితీలేని వాళ్లు ఢిల్లీని ఆప‌ద‌లోకి నెట్టేశార‌ని, ఆప్ పార్టీ.. ఢిల్లీపై ఆప‌ద‌లా ప‌డి, మొత్తం దోచేసుకుంటోంద‌ని ప్ర‌ధాని విమ‌ర్శించారు. రాజ‌కీయ‌, ఆర్థిక స్థిర‌త్వానికి భారత్ సింబ‌ల్‌గా మారింద‌ని పేర్కొన్నారు. 
 
2025లో భార‌త పాత్ర మ‌రింత బ‌ల‌ప‌డింద‌ని పేర్కొంటూ ఈ ఏడాది ప్ర‌పంచ ప‌ట్టిక‌లో ఇండియాను మ‌రింత ఉన్న‌త స్థానంలో నిల‌పాల‌ని కోరారు. ఢిల్లీ అభివృద్ధికి ఇది చాలా ముఖ్య‌మైన రోజు అని ప్ర‌ధాని మోదీ త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు. జుగ్గి-జోప్రి అర్బ‌న్ రీడెవ‌లప్‌మెంట్ ప్రాజెక్టుకు చెందిన 1675 ఫ్లాట్ల‌ను ప్ర‌ధాని మోదీ ఆవిష్క‌రించారు. అశోక్ విహార్ ఏరియాలోని స్వాభిమాన్ అపార్ట్‌మెంట్‌లో నిర్మించిన ఈబ్ల్యూఎస్ ఫ్లాట్ల‌కు చెందిన ల‌బ్ధిదారుల‌కు ఇంటి తాళాలు అంద‌జేశారు.”ఈ రోజు ఇక్కడకు వచ్చినప్పుడు ఎన్నో పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఇందిరాగాంధీ నియంతృత్వానికి వ్యతిరేకంగా యావద్దేశం పోరాడుతున్నప్పుడు నాలాంటి ఎందరో అజ్ఞాతంలో ఉండి ఉద్యమించారు. ఇదే అశోక్ విహార్‌లో జీవనం సాగించాను” అని మోదీ తెలిపారు. దీనికి ముందు రూ.4500 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. అశోక్ విహార్‌లోని స్వాభిమాన్ అపార్ట్‌మెంట్‌లో ఇన్-సిటు స్లమ్ రిహాబిలేషన్ ప్రాజెక్టు కింద మురికివాడల కోసం నిర్మించిన కొత్త ఫ్లాట్‌లను ప్రధాని సందర్శించారు.