యంగ్ చెస్ ప్లేయర్ వైశాలికి కాంస్యం

యంగ్ చెస్ ప్లేయర్ వైశాలికి కాంస్యం

తాజాగా జరిగిన వరల్డ్‌ బ్లిట్జ్‌ ఛాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో భారత్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌. వైశాలి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. అనూహ్య ఆటతీరుతో అజేయంగా దూసుకెళ్తున్న ఈ తమిళనాడు క్రీడాకారిణి 9.5 పాయింట్లతో క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకుంది. దీంతో తాజా టోర్నీలో నాకౌట్‌లో అడుగుపెట్టిన ఏకైక భారత ప్లేయర్‌గా నిలిచిన వైశాలి.. 2024లో గుకేశ్‌, హంపి తర్వాత మరో వరల్డ్‌ చాంపియన్‌గా రికార్డులకెక్కాలనుకుంటోంది.

క్వార్టర్‌ ఫైనల్స్‌లో చైనాకు చెందిన జు జినార్‌పై 2.5-1.5 తేడాతో వైశాలి గెలిచింది. అయితే సెమీస్‌లో చైనాకు చెందిన జు వెంజన్‌ చేతిలో 0.5-2.5 తేడాతో ఓటమిని చవి చూసింది. ఇక ఇటీవలె ర్యాపిడ్‌ ఈవెంట్‌లో కోనేరు హంపి టైటిల్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. తొలి దశలో ఆడిన 11 రౌండ్లలో 8 విజయాలు, మూడు డ్రాలతో వైశాలి లోకి వెళ్ళింది.  

టాప్‌-8 మాత్రమే క్వార్టర్స్‌కు వెళ్లనుండగా, 8 పాయింట్లతో హంపి తొమ్మిదో స్థానంలో నిలిచింది. దివ్య, వంతిక కూడా నిరాశపరిచారు. ఇక ఓపెన్‌ విభాగంలోనూ వైశాలి సోదరుడు ప్రజ్ఞానంద (8.5) 23వ స్థానంలో, అర్జున్‌ ఇరిగేసి (7) 64వ స్థానంలో, ప్రణవ్‌ (7) 67వ స్థానంలో నిలిచి నిష్క్రమించారు.

మరోవైపు వైశాలి విజయాన్ని కొనియాడుతూ చెస్ అభిమానులు, పలువురు ప్రముఖులు నెట్టింట పోస్ట్​లు పెడుతున్నారు. ఈ క్రమంలో చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ అయిన సీనియర్ ప్లేయర్ విశ్వనాథన్‌ ఆనంద్‌ ఆమె విజయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వైశాలిపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇక ర్యాపిడ్ ఈవెంట్ టైటిల్​ను గెలుచుకున్న కోనేరు హంపిని కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా అభినందించారు.

“వరల్డ్‌ బ్లిట్జ్‌ ఛాంపియన్‌షిప్‌లో మెడల్ సాధించిన వైశాలికి అభినందనలు. ఆమె దేశం మరింత గర్వపడేలా చేసింది. ఆమెకూ, ఆమె చెస్‌కు మద్దతు ఇస్తున్నందుకు ఎంతో చాలా సంతోషంగా ఉన్నాం.” అంటూ ట్విట్టర్​ వేదికగా విశ్వనాథన్‌ ఆనంద్‌ హర్షం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, పురుషుల ఓపెన్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ ప్లేయర్ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ రష్యాకు చెందిన ఇయాన్‌ నెపోమ్నియాచితో తలపడ్డారు. అయితే మూడు సార్లు వీళ్ల గేమ్‌ డ్రాగా ముగిసింది. దీంతో ఆ టైటిల్‌ను ఈ ఇద్దరూ పంచుకోవాల్సి వచ్చింది.

అయితే గతంలో డ్రెస్‌ కోడ్ పాటించకపోవడం వల్ల మాగ్నస్‌పై చీఫ్ ఆర్బిటర్ అలెక్స్ హోలోసక్ అనర్హత వేటు వేశారు. అంతేకాకుండా అతడికి 200 డాలర్ల జరిమానా కూడా విధించారు. జీన్స్ వేసుకొని ఈవెంట్‌లో పాల్గొన్న మాగ్నస్‌కు ఈ జరిమానా  పడింది. ఇదే తప్పిదం గతంలోనూ చేశాడు. ఇప్పుడు మరోసారి అలాగే చేయడంతో అతడిపై వేటు కూడా పడింది.