కన్యాకుమారి తీరంలో దేశంలోనే మొట్టమొదటి గాజు వంతెన

కన్యాకుమారి తీరంలో దేశంలోనే మొట్టమొదటి గాజు వంతెన
దేశంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో తమిళనాడు రాష్ట్రం ఒకటి. అక్కడ ప్రకృతి అందాలతో పాటు ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. వీటిని చూసేందుకు దేశ నలుమూలల నుంచి ప్రజలు నిత్యం తమిళనాడుకు పోటెత్తుతుంటారు. ఈ నేపథ్యంలో పర్యాటకులను ఆకర్షించేందుకు అక్కడి ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలను, మౌలిక వసతులను కల్పిస్తోంది.
 
ఇందులో భాగంగానే దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్లాస్‌ బ్రిడ్జ్‌ ను నిర్మించింది. బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేసిన ఈ గాజు వంతెనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ సోమవారం ప్రారంభించారు.  కన్యాకుమారి తీరంలో వివేకానంద స్మారక మండపానికి 77 మీటర్ల దూరంలో 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి హయాంలో తిరువళ్లువర్‌ విగ్రహాన్ని ప్రతిష్టించారు. 
 
ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగి జనవరి 1వ తేదీకి 25 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తమిళనాడు ప్రభుత్వం రెండు రోజులపాటు సిల్వర్‌జూబ్లీ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే వివేకానంద మండపం, తిరువళ్లువర్‌ విగ్రహాన్ని కలిపేలా దేశంలోనే మొదటిసారి సముద్రం మధ్యన ఈ గాజు వంతెనను తమిళనాడు ప్రభుత్వం నిర్మించింది 77 మీటర్ల పొడవు ఉన్న ఈ అద్దాల వంతెన.. 10 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. ఇక ఈ గ్లాస్ బ్రిడ్జి నిర్మాణ వ్యయం.. రూ.37 కోట్లు. దీనికి గత ఏడాది మే 24వ తేదీన శంకుస్థాపన చేయగా ఇటీవలె పూర్తయింది. రేపటి నుంచి సిల్వర్‌జూబ్లీ వేడుకల నేపథ్యంలో ఈ గాజు వంతెనను సీఎం ప్రారంభించారు. ఈ వంతెనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.