ప్రధాని మోదీపై అమెరికా సింగర్‌ పొగడ్తలు

ప్రధాని మోదీపై అమెరికా సింగర్‌ పొగడ్తలు

భారత ప్రధాని నరేంద్రమోదీని ఆఫ్రికా- అమెరికా సింగర్‌, నటి మేరీ మిల్బన్‌ మంగళవారం పొగడ్తల్లో ముంచెత్తారు. ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ జీసస్‌ క్రీస్ట్‌ను పార్థించడాన్ని ఆమె ప్రశంసించారు. మోదీకి క్రిస్మస్‌ పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ప్రధాని మోదీ తాజాగా దేశంలోని క్యాథలిక్‌ చర్చి హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన క్రిస్మస్‌ వేడుకలకు హాజరయ్యారు.

దానిపై సింగర్‌ మేరీ మిల్బన్‌ తన అధికారిక ఎక్స్‌ హ్యాండిల్‌లో స్పందించారు. ‘మీకు శుభాకాంక్షలు. జీసస్‌ క్రీస్ట్‌ ఒక గొప్ప బహుమతి. ప్రేమకు ఉదాహరణ. ఇండియన్ బిషప్స్‌ క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌లో మీరు బహిరంగంగా నా రక్షకుడు క్రీస్తును ప్రార్థించినందుకు కృతజ్ఞతలు. వేడుకల్లో మీ మాటలు నా హృదయాన్ని తాకాయి. భారత్‌లోని సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు’ అని మేరీ మిల్బన్‌ పేర్కొన్నారు.

అందుకు ప్రధాని మోదీ స్పందిస్తూ.. క్రీస్తు బోధనలు సమాజానికి ప్రేమ, శాంతి, సోదరభావాన్ని నేర్పాయని రాసుకొచ్చారు. ఆ స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు మనందరం కృషి చేయడం చాలా ముఖ్యమని తెలిపారు. కాగా మేరీ మిల్బన్‌ ప్రధాని మోదీని తొలిసారి 2023 జూన్‌లో ఆమెరికాలో కలిశారు. మోదీ అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్‌లోని రొనాల్డ్‌ రీగన్‌ బిల్డింగ్‌లో మేరీ మిల్బన్‌ భారత జాతీయ గీతాన్ని ఆలపించారు.

జాతీయ గీతం ఆలాపన అనంతరం మిల్బన్‌ ప్రధాని మోదీ పాదాలను తాకి నమస్కరించారు. ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ చర్య ద్వారా ఆమె ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించారు. ఇటీవల మరో కార్యక్రమంలో కూడా మిల్బన్‌.. మహిళా సాధికారత కోసం మోదీ చేస్తున్న కృషిని కొనియాడారు. మణిపూర్‌లో హింసాకాండ సాగుతున్న సమయంలో కూడా మిల్బన్‌ మోదీని పొగిడారు.