కేన్- బేట్వా న‌దీ ప్రాజెక్టుకు ప్ర‌ధాని మోదీ శంకుస్థాప‌న‌

కేన్- బేట్వా న‌దీ ప్రాజెక్టుకు ప్ర‌ధాని మోదీ శంకుస్థాప‌న‌
* వాజ్‌పేయి స్మారక స్టాంపు విడుదల
 
నధుల అనుసంధానంలో మొదటిదైన కెన్- బెత్వా నధుల అనుసంధాన ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో బుధవారంనాడు ప్రారంభించారు. రెండు నదుల జలాలను ఆయన ప్రాజెక్టు నమూనాలో పోశారు. అనంతరం రిమోట్ బటన్ సాయంతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 
 
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ శత జయంతిని పురస్కరించుకుని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కెన్-బెత్వా రీవర్ లింకింగ్ నేషనల్ ప్రాజెక్టు ద్వారా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు ఇరిగేషన్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి లక్షలాది మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. తాగునీటి సౌకర్యం కూడా ఈ ప్రాంత వాసులకు లభ్యమవుతుంది.

ప్రాజెక్టు శుంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ మాడ్లాడుతూ, ఈరోజు యావత్ ప్రపంచం క్రిస్మమ్ వేడుక జరుపుకుంటోందని, దేశవిదేశాల్లోని క్రైస్తవులందరికీ శుభాకాంక్షలని చెప్పారు. ముఖ్యమంత్రి మోహన్ లాల్ యాదవ్ సారధ్యంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజుతో ఏడాది పూర్తి చేసుకుంటున్నందున ఆయనకు, బీజేపీ కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజలకు అభినందలు తెలియజేస్తున్నానని చెప్పారు. 

గత ఏడాది అభివృద్ధి కొత్త పుంతలు తొక్కిందని, ఈరోజు కోట్లాది రూపాయలు విలువజేసే అభివృద్ధి ప్రాజెక్టులను శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు. కెన్-బెత్వా రీవర్ లింకింగ్ ప్రాజెక్టును కూడా ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. ఇదేరోజు భారతరత్న వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలు జరుపుకొంటున్నామని, ఇది సుపరిపాలన పండుగని, సుపరిపాలన అంటేనే బీజేపీ అని మోదీ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ, బుందేల్‌ఖండ్ ప్రజలకు ఏళ్ల తరబడి కాంగ్రెస్ అబద్ధాలు చెబుతూ వచ్చిందని విమర్శించారు. ఈ ప్రాంతానికి ప్యాకేజీ ఇస్తామని హామీలు ఇచ్చి నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ఈరోజు బుందేల్‌ఖండ్‌లోని 11 జిల్లాలకు తాగునీరు, ఇరిగేషన్, ఇండస్ట్రీలకు జలాలు అందనున్నాయని చెప్పారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని 10 జిల్లాల‌కు చెందిన 44 ల‌క్ష‌ల మందికి, యూపీకి చెందిన 21 ల‌క్ష‌ల మందికి న‌దీ అనుసంధానం ప్రాజెక్టుతో తాగునీటిని అందించ‌నున్నారు. ఈ ప్రాజెక్టు కోసం 44 వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. రెండు వేల గ్రామాల్లోని 7.18 ల‌క్ష‌ల వ్య‌వ‌సాయ కుటుంబాలు ల‌బ్ధిపొంద‌నున్నాయి.

కాగా, కెన్-బెత్వా రివర్ లింగ్ ప్రాజెక్టు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాజ్‌పేయి శతజయంతిని పురస్కరించుకుని స్మారక తపాలా బిళ్లను, రూ.100 నాణేన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. అటల్ గ్రామ్ సుశాన్ బిల్డింగ్‌లకు ప్రధాని శంకుస్థాపన చేశారు.