ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్యామ్ బెన‌గ‌ల్ క‌న్నుమూత‌

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్యామ్ బెన‌గ‌ల్ క‌న్నుమూత‌

భారతీయ సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్యామ్ బెన‌గ‌ల్(90) క‌న్నుమూశారు.  బెనెగల్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆయన  ముంబైలోమృతి చెందినట్లు ఆయన కుమార్తె పియా బెనెగల్ మీడియాకు తెలిపారు. డిసెంబర్ 14న తన 90వ పుట్టినరోజును స్నేహితులు, కుటుంబ సభ్యులతో దర్శకుడు బెనగల్ జరుపుకున్నారు.

బెనెగల్‌ మృతిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సినీ ప్రముఖులు శేఖర్‌ కపూర్‌, హన్సల్‌ మెహతా, మనోజ్‌ బాజ్‌పాయి, అక్షయ్‌ కుమార్‌, కాజోల్‌ సంతాపం వ్యక్తం చేశారు. అద్భుతమైన దర్శకులు, మేధావులలో ఒకరైన శ్యామ్‌ బెనెగల్‌ మృతి తనను తీవ్రంగా బాధించిందని ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవి సంతాపం ప్రకటించారు.

1934 డిసెంబర్‌ 14న హైదరాబాద్‌లో జన్మించిన శ్యామ్‌ బెనెగల్‌ కొంకణీ మాట్లాడే చిత్రపూర్‌ సారస్వత్‌ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. కర్ణాటకకు చెందిన శ్యామ్‌ బెనెగల్‌ తండ్రి శ్రీధర్‌ బీ బెనెగల్‌ ఫొటోగ్రాఫర్‌ కావడంతో కెమెరా పట్ల శ్యామ్‌కు చిన్నప్పటి నుంచే ఆసక్తి ఏర్పడింది. తన 12వ ఏట తన తండ్రి బహుమతిగా ఇచ్చిన కెమెరాతో శ్యామ్‌ బెనెగల్‌ తన మొదటి చిత్రాన్ని తీశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ పొందిన ఆయన హైదరాబాద్‌ ఫిల్మ్‌ సొసైటీని స్థాపించి తన సినీ ప్రయాణానికి బాటలు వేసుకున్నారు.

ప‌ద్మ శ్రీ, ప‌ద్మ‌భూష‌ణ్‌, దాదా సాహెబ్ ఫాల్కే, ఏఎన్ఆర్ జాతీయ అవార్డుల‌ను శ్యామ్ బెన‌గ‌ల్ అందుకున్నారు. హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీని కూడా స్థాపించాడు, సినిమా రంగంలో తన అద్భుతమైన ప్రయాణానికి నాంది పలికాడు. సికింద్రాబాద్ ప్ర‌భుత్వ కాలేజీలో డిగ్రీ చ‌దివారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి ఎంఏ ఎక‌నామిక్స్ ప‌ట్టా పొందారు. సామాజిక స‌మ‌స్య‌లు, ఆర్థిక అస‌మాన‌త‌ల‌పై ఆయ‌న సినిమాలు రూపొందించారు. ఎనిమిది సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. 

కాపీ రైటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన బెనెగ‌ల్ 1962లో గుజరాతీలో తన మొదటి డాక్యుమెంటరీ చిత్రం ఘేర్ బేతా గంగా (గంగా నది వద్ద) తీశాడు. 2005లో సినిమా రంగంలో భారతదేశ అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించారు. 1978లో వాణిశ్రీ, అనంతనాగ్‌లతో ఆయన తీసిన ఏకైక తెలుగు చిత్రం అనుగ్రహం 1979 బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు నోచుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

శ్యామ్ బెన‌గ‌ల్‌కు పేరు తెచ్చిన సినిమాలు.. అంకూర్(1974), నిషాంత్ (1975), మంత‌న్(1976), భూమిక‌(1977), జునూన్(1978). ఇక జ‌బ‌ర్‌ద‌స్త్ డాక్యుమెంట‌రీని రూపొందించారు. ప‌ద్మ‌శ్రీ(1976), ప‌ద్మ‌భూష‌ణ్‌(1991), దాదాసాహెబ్ ఫాల్కే(2005) అవార్డులు వ‌రించాయి. జాతీయ సినిమా అవార్డులలో శ్యాం బెనగల్‌ ఏడు సార్లు హిందీలో అత్యుత్తమ సినిమా అవార్డుల‌ను అందుకున్నారు.

శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో తెరకెక్కిన అనేక చిత్రాలకు అవార్డులు దక్కాయి. మమ్మో (1994) సర్దారీ బేగం (1996), జుబేదా (2001) తదితర చిత్రాలు ఆయన్ని చిత్ర సీమలో అగ్రభాగాన నిలిపాయి. అలాగే అంకూరు, నిషాంత్, మంథన్, భూమిక, జనూన్, మండి తదితర చిత్రాలు సైతం సంచలనం సృష్టించాయి. 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారాన్ని అందుకున్నారు.

జవహర్‌లాల్‌ నెహ్రూ రచించిన డిస్కవరీ ఆఫ్‌ ఇండియా ఆధారంగా దూరదర్శన్‌ కోసం ఆయన రూపొందించిన భారత్‌ ఏక్‌ ఖోజ్‌ డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలలో అంకుర్‌, మంథన్‌, మండి, నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌: ది ఫర్‌గాటెన్‌ హీరో, జుబేదా, వల్‌ డన్‌ అబ్బా వంటివి అంతర్జాతీయంగా పేరు గడించాయి.