ఒవైసీకి బరేలీ కోర్టు సమన్లు

ఒవైసీకి బరేలీ కోర్టు సమన్లు

రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పార్లమెంటులో పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేశారంటూ ఉత్తర ప్రదేశ్ లోని బరేలీ కోర్టు మంగళవారం ఎఐఎంఐఎం అధినేత ఒవైసీకి సమన్లు జారీ చేసింది. పార్లమెంటులో ప్రమాణస్వీకారం సందర్భంగా పాలస్తీనాకు మద్దతుగా ఒవైసీ నినాదాలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది వీరేంద్ర గుప్తా పిటిషన్‌ దాఖలు చేశారు. 

రాజ్యాంగ, చట్టపరమైన విశ్వాసాలను ఉల్లంఘించారని తెలిపారు. నినాదాలతో తాను బాధపడ్డానని పిటిషన్‌లో పేర్కొన్నారు. జులై 12న ఎంపి/ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్‌ వేయగా తిరస్కరణకు గురైందని వీరేంద్ర గుప్తా పేర్కొన్నారు. దీంతో బరేలీ జిల్లా జడ్జి కోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిపారు. 

జడ్జి సుధీర్‌ పిటిషన్‌ను విచారణకు అనుమతిస్తూ జనవరి 7న ఓవైసీ విచారణకు హాజరుకావాలని డిసెంబర్‌ 21న నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌ 25న హైదరాబాద్‌ ఎంపిగా ఒవైసీ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాణస్వీకారం తర్వాత పోడియం వద్ద పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేశారు. 

అనంతరం ఈ వ్యాఖ్యలను తొలగించాలని చైర్మన్‌ ఆదేశించారు. సభనుండి బయటకు వచ్చిన తర్వాత ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. ” జైభీమ్‌”, ” జై మీమ్‌ ” , ” జై తెలంగాణ”, ”జై పాలస్తీనా” అనడంలో తప్పులేదని స్పష్టం చేశారు.