
మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని భారత్ను బంగ్లాదేశ్ కోరింది. అందుకోసం భారత్కు దౌత్యపరమైన లేఖను పంపినట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది. విద్యార్థుల సారథ్యంలో నిరసనలతో తన 16 సంవత్సరాల ప్రభుత్వం పతనమైన నేపథ్యంలో 77 ఏళ్ల హసీనా ఆగస్టు 5న బంగ్లాదేశ్ నుంచి పరారై భారత్లో ప్రవాస జీవితం సాగిస్తున్న విషయం విదితమే.
బంగ్లాదేశ్ హైకమిషన్ నుండి భారతదేశానికి అప్పగింత అభ్యర్థనకు సంబంధించి ఒక నోట్ వెర్బేల్ అందిందని విదేశాంగ ప్రతినిధి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ధృవీకరించారు. అయితే, ఈ విషయంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
‘మానవాళిపై సాగించిన నేరాలకు, మారణకాండకు’ హసీనాపైన, పలువురు మాజీ క్యాబినెట్ మంత్రులు, సలహాదారులు, సైనిక, పౌర అధికారులపై బంగ్లాదేశ్ కేంద్రంగా గల అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (ఐసిటి) అరెస్టు వారంట్లు జారీ చేసింది. ‘న్యాయ ప్రక్రియ కోసం ఆమెను ఢాకాకు తిరిగి పంపించవలసిందిగా బంగ్లాదేశ్ కోరుతోందని అంటూ మేము భారతీయ ప్రభుత్వానికి ఒక దౌత్య పత్రం పంపాం’ అని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ సలహాదారు తౌహిద హొస్సేన్ తన కార్యాలయంలో విలేకరులతో చెప్పారు.
భారత్ నుంచి పదవీచ్యుతురాలైన ప్రధాని అప్పగింతకు వీలుగా విదేశాంగ మంత్రిత్వశాఖకు తన కార్యాలయం ఒక లేఖ పంపిందని హోమ్ శాఖ సలహాదారు జహంగీర్ ఆలమ్ సోమవారం ఉదయం తెలిపారు.
‘ఆమె అప్పగింత విషయమై విదేశాంగ మంత్రిత్వశాఖకు మేము ఒక లేఖ పంపాం. ఆ ప్రక్రియ ప్రస్తుతం సాగుతోంది’ అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఢాకా, న్యూఢిల్లీ మధ్య అప్పగింత ఒప్పందం ఇప్పటికే ఉందని, దాని కింద హసీనాను బంగ్లాదేశ్కు తిరిగి తీసుకురావచ్చునని ఆలమ్ తెలిపారు.
మధ్యంతర ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి క్రితం నెల బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్ ప్రసంగిస్తూ, హసీనా అప్పగింతను తాము కోరతామని చెప్పారు. ‘ప్రతి హత్యలో న్యాయం జరిగేలా మేము చూడాలి&. పదవీచ్యుతురాలైన నియంత షేఖ్ హసీనాను తిరిగి పంపించాలని భారత్ను అడుగుతాం కూడా’ అని ఆయన తెలిపారు.
వ్యక్తుల అప్పగింతకు సంబంధించి భారత్-బంగ్లాదేశ్ మధ్య ఒప్పందం ఉందని, దీని ప్రకారం హసీనాను స్వదేశానికి తిరిగి తీసుకురావచ్చని చెప్పారు. ఈ ఏడాది జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు బంగ్లాదేశ్లో జరిగిన మారణహోమం, హత్యలు, ఇతర నేరాల ఆరోపణలపై షేక్ హసీనా సహా ఆమె పార్టీ అవామీ లీగ్కు చెందిన అగ్ర నాయకులు 45 మందిపై ఇప్పటికే అరెస్టు వారెంట్ జారీ అయింది.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్లకు భారత్ హెచ్చరిక