సినీ నటుడు అల్లు అర్జున్ పట్ల పోలీసులకు వ్యతిరేకత అంటూ ఏమీ లేదని, కేవలం చట్టం ప్రకారమే ఆయన పట్ల చర్య తీసుకొంటున్నామని తెలంగాణ డిజిపి జితేందర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో కొత్తగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ అల్లు అర్జున్ సినీ హీరో అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమాజంలో శాంతిభద్రతలు ఫరిఢవిల్లాలంటే పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని డీజీపీ గుర్తు చేశారు. సినీ ప్రమోషన్ కంటే పౌరుల భద్రత, రక్షణే తమకు ప్రాధాన్యమని స్పష్టంచేశారు. ఇలాంటి ఘటనలు జరగడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదని స్పష్టం చేశారు. “సినిమాల్లో హీరోలైనా బయట మాత్రం పౌరులే. క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా తెలుసుకోవాలి. చట్టానికి లోబడి పోలీసు శాఖ పని చేస్తుంది. తప్పు ఎవరు చేసినా కేసులు నమోదు చేస్తాం. పౌరుల రక్షణే మాకు ప్రాధాన్యం. అల్లు అర్జున్కు మేం వ్యతిరేకం కాదు. చట్టప్రకారం అల్లు అర్జున్పై చర్యలు తీసుకున్నాం. సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం” అని జితేందర్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళలు, పిల్లల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తుందని, అందువల్లే ప్రతి జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని డిజిపి పేర్కొన్నారు. రాష్ట్రంలో 20 ఎస్పీ కార్యాలయాలు, మరో 9 కమిషనరేట్లు ఉన్నాయని, ఇప్పటివరకు 27 భరోసా కేంద్రాలను ప్రారంభించినట్లు డీజీపీ చెప్పారు. చట్టానికి లోబడి పోలీసు శాఖ పని చేస్తుందని, తప్పు ఎవరు చేసినా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
‘సినీ నటుడు మోహన్బాబుపై కేసు నమోదు చేశాం. మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో చట్ట ప్రకారం ఆయనపై చర్యలు ఉంటాయి. మోహన్ బాబుది వారి కుటుంబ సమస్య. ఇంటి సమస్య కాబట్టి వాళ్లే పరిష్కరించుకోవాలి. ప్రజలకు రక్షణ కల్పించడం మా మొదటి ప్రాధాన్యం. మహిళలు, పిల్లల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుంది. ప్రజల భద్రత కోసం 24 గంటలు పని చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం చొరవ వల్లే భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం’ అని తెలంగాణ డీజీపీ జితేందర్ చెప్పుకొచ్చారు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి