పాకిస్థాన్ మిలటరీ కోర్టు 25 మంది పౌరులకు జైలు శిక్ష విధించింది. గత ఏడాది మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేయడంతో నిరసనలు చేపట్టిన వీరు సైనిక స్థావరాలపై దాడి చేయడమే అందుకు కారణం. దీంతో తాజాగా పౌరులకు శిక్షను విధించింది.
అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో గత ఏడాది మేలో తెహ్రీక్ ఏఇన్సాఫ్ ( పీటీఐ) అధినేత , మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టును నిరసిస్తూ ఆయన మద్దతుదారులు నిరసన చేపట్టారు. ఇవి అల్లర్లకు దారి తీశాయి. రావల్పిండి లోని ఆర్మీ ప్రధాన కార్యాలయంతోపాటు ఫైసలాబాద్ లోని ఐఎస్ఐ భవనం సహా అనేక సైనిక స్థావరాలపై ఆందోళనకారులు దాడి చేశారు.
దీనిపై వందలాది మంది అనుమానితులను అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం 103 మందిని మిలటరీ అధికారులకు అప్పగించారు. తాజాగా ఈ ఘటనపై మిలటరీ కోర్టు విచారణ చేపట్టింది. 25 మంది పౌరులను దోషులుగా తేల్చింది. వీరికి రెండు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షను విధించింది. మిగిలిన వారికి కూడా శిక్షను విధిస్తామని గడువు ప్రక్రియ ముగిసిన తరువాత ఈ అంశాన్నీ పరిశీలిస్తామని న్యాయస్థానం తెలిపింది.
ఇదిలా ఉండగా పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ఖాన్ ప్రస్తుతం అడియాలా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీటీఐ పార్టీ మద్దతుదారులు గత నెలలో కూడా ఆందోళనలు చేపట్టారు. దాంతో రాజధాని ఇస్లామాబాద్ రణరంగంగా మారింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు.

More Stories
భారత్, అమెరికాల మధ్య 10 ఏళ్ల రక్షణ ఒప్పందం
చాబహార్ పోర్ట్పై అమెరికా ఆంక్షల నుండి తాత్కాలిక ఊరట
అమెరికాలో వర్క్ పర్మిట్ ఆటోమేటిక్ రెన్యువల్ రద్దు