భారత్‌కు ప్రపంచానికే నైపుణ్య రాజధాని అయ్యే సత్తా

భారత్‌కు ప్రపంచానికే నైపుణ్య రాజధాని అయ్యే సత్తా
భారతీయుల శ్రమశక్తి, నైపుణ్యాలు నవ కువైత్‌ నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతూ ప్రపంచానికే నైపుణ్య రాజధాని అయ్యే సత్తా భారత్‌కు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రానున్న కొన్ని దశాబ్దాలపాటు ప్రపంచంలోనే అత్యంత యువ దేశంగా భారత్‌ ఉంటుందని పేర్కొన్నారు. కువైత్‌ రాజు షేక్‌ మిషాల్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ జుబేర్‌ అల్‌ సబహ్‌ ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం కువైత్‌కు చేరుకున్న ప్రధాని ఇక్కడి ‘షేక్‌ సాద్‌ అల్‌ అబ్దుల్లా ఇండోర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌’లో ప్రవాస భారతీయులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. 
 
‘‘మీరందరూ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఇక్కడ మినీ భారతదేశమే ఉన్నట్టుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఏటా భారతదేశం నుంచి కువైత్‌కు వస్తున్న వందలాది మంది భారతీయులు కువైత్‌ సమాజానికి భారతీయ ఆత్మను జోడిస్తారు. కువైత్‌ కాన్వా్‌సను భారతీయ నైపుణ్యాలు, ప్రతిభతో నింపేస్తారు’’ అని మోదీ కొనియాడారు.
 
నలభైమూడేళ్ల క్రితం 1981లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత ఒక భారత ప్రధాని కువైత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆ విషయాన్ని కూడా మోదీ ప్రస్తావించారు. ‘‘ఇక్కడి నుంచి ఇండియాకు రావడానికి మీకు పట్టేది నాలుగు గంటలే. కానీ ఒక భారత ప్రధాని కువైత్‌కు రావడానికి నాలుగు దశాబ్దాలు పట్టింది’’ అని పేర్కొన్నారు.

‘ఎక్స్‌’ వేదికగా తాను ఇచ్చిన మాట ప్రకారం ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ మాజీ అధికారి, 101 సంవత్సరాల వయోవృద్ధుడు అయిన మంగళ్‌ సెయిన్‌ హండాను మోదీ ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు. తన తాత మంగళ్‌ హండా ప్రధాని వీరాభిమాని అని,కువైత్‌ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన్ను కలిసి మాట్లాడాలని హండా మనవరాలు శ్రేయ జునేజా ‘ఎక్స్‌’ వేదికగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 

తప్పకుండా కలుస్తానని మోదీ ఎక్స్‌లోనే ఆమెకు సమాధానమిచ్చారు. నిజానికి మంగళ్‌ హండా 100వ పుట్టినరోజు సందర్భంగానే ప్రధాని మోదీ ఆయనకు వ్యక్తిగత లేఖ ద్వారా గతంలో శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ప్రధాని వ్యక్తిగతంగా తనను కలవడంతో ఎంతగానో సంతోషించారు. కాగ ప్రధాని మోదీ ఆదివారంనాడు కువైత్‌ రాజును, ప్రధానమంత్రిని కలవనున్నారు.

మోదీకి ఆ దేశ ఉప ప్రధాని షేక్‌ ఫహాద్‌ యూసుఫ్‌ సౌద్‌ అల్‌ సబహ్‌ విమానాశ్రయంలో సాదరంగా స్వాగతం పలికారు.  ఓ వైపు ప్రవాస భారతీయులంతా చప్పట్లు, వందేమాతరం నినాదాలతో హోరెత్తిస్తుండగా అక్కడున్న వారందరినీ మోదీ పలకరించారు. రామాయణం, మహాభారతాలను అరబిక్‌లోకి అనువదించిన అబ్దుల్లా అర్‌ బెరూన్‌, ఈ ఇతిహాసాలను అరబిక్‌లో ప్రచురించిన అబ్దుల్‌ లతీఫ్‌ అల్‌ సెనె్‌ఫలను మోదీ పలకరించారు.

కువైట్‌ భవిష్యత్‌ తరాలను తీర్చిదిద్దడంలో భారతీయ ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా మారిందని ప్రధాని తెలిపారు. భారత్‌ స్టార్టప్‌లు, కువైట్‌ అవసరాలకు అత్యాధునిక పరిష్కారాలను చూపించగలవని చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో భారత్‌కు లిక్విడ్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేసిన కువైట్‌ ప్రభుత్వానికి ఈ సందర్భంగా మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ పర్యటనలో అరేబియన్‌ గల్ఫ్‌ కప్‌ ఫుట్‌ బాల్‌ ప్రారంభోత్సవంలో కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్ సబాను కలిశాను. “అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవంలో కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్ సబాను కలవడం ఆనందంగా ఉంది” అని ప్రధాని మోదీ ఆదివారం ఎక్స్ లో  పోస్ట్ చేశారు. శనివారం ఇక్కడి జాబర్ అల్-అహ్మద్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన 26వ అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మరోవైపు డిసెంబరు 1 అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ధ్యానాన్ని తమ జీవితంలో ఓ భాగం చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని రన్‌ ఆఫ్‌ కచ్‌లో జరుగుతున్న ‘రన్‌ ఉత్సవ్‌’లో పాలుపంచుకోవాల్సిందిగా మోదీ అందరికీ ఆహ్వానం పలికారు.