ముంబై తీరంలో బోటు మునక.. 13 మంది దుర్మరణం

ముంబై తీరంలో బోటు మునక.. 13 మంది దుర్మరణం
 
* రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

మహారాష్ట్రలో ముంబై తీరంలో వెళ్తున్న ఓ ఫెర్రీ నౌకను సముద్రంలో వెళ్తున్న ఓ స్పీడ్ బోట్ అతివేగంతో వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ఫెర్రీ నౌక మునిగిపోయింది. దీంతో అందులో ఉన్న పర్యాటకులు నీటిలో పడిపోయారు. ఇందులో ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు అధికారులు గుర్తించారు. పడవ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అధికారులు, నేవీ, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని భారీ రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టారు.
ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారని,ఆ బోట్ లో 110 మంది ఉన్నారని, 77 మందిని కాపాడినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ముఖ్యమంత్రి ప్రకటించారు. కాగా, ఈ ఘటన ఫెర్రీని స్పీడ్ బోటు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరికొందరి ఆచూకీ లభ్యం కాలేదని, వారికోసం గాలింపు కొనసాగుతోందని దేవేంద్ర ఫడణవీస్‌ తెలిపారు. తక్షణ సహాయక చర్యలకు అధికారులను ఆదేశించారు. 

ఎలిఫెంటా కేవ్స్‌కు వెళ్తున్న నీల్‌కమల్ బోట్ ప్రమాదానికి గురైనట్టు సమాచారం అందిందని, తక్షణ సహాయక చర్యలకు నేవీ, కోస్ట్‌గార్డ్, పోర్ట్, పోలీసు టీమ్‌లను పంపామని సీఎం చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 

ఇండియన్ నేవీ క్రాఫ్ట్ బోటు, ప్రయాణికుల ఫెర్రీ బోటు ఢీకొన్న దుర్ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. సహాయక చర్యలు విజయవంతం కావాలని, సురక్షితంగా బయటపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు సామాజిక మాధ్యమం “ఎక్స్”లో పోస్ట్ చేశారు.

ఈ ప్రమాదంలో మరణించిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ, ఈ సంఘటన బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన నేవీ, కోస్టు గార్డు బృందాలు భారీ ఆపరేషన్‌ చేపట్టాయి. నేవికి చెందిన 11 బోట్లు, మెరైన్ పోలీసులకు చెందిన మూడు బోట్లు, కోస్టు గార్డు చెందిన బోటు రంగంలోకి దిగాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. 

నాలుగు హెలికాప్టర్లు కూడా గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు సిబ్బంది, స్థానిక మత్స్యకారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నేవీ బోటుకు ఇటీవలే కొత్త ఇంజన్‌ను బిగించారు. దాన్ని పరీక్షిస్తున్న సమయంలో అది నియంత్రణ కోల్పోయి నీల్‌కమల్‌ ఫెర్రీని ఢీకొట్టింది. నేవీ బోటులో ఆరుగురు సిబ్బంది ఉన్నారని, వీరిలో ఇద్దరు నేవీ సిబ్బంది, నలుగురు ఇంజన్‌ సరఫరా చేసిన కంపెనీకి చెందిన వారున్నారని తెలుస్తోంది.