కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌ లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌ లో ఐదుగురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. కుల్గామ్‌ జిల్లాలోని బెహిబాగ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందగా, మరో ఇద్దరిని ప్రాణాలతో పట్టుకున్నారని అధికారులు తెలిపారు.
 
ఈ క్రమంలో ముష్కరులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు చనిపోయారని ఇండియన్‌ ఆర్మీకి చెందిన చినార్‌ కార్ప్స్‌ ఎక్స్‌ వేదికగా వెళ్లడించింది.  ఘటనా స్థల నుంచి మందుగుండు సామాగ్రి, ఎకె47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టెర్రరిస్టుల కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడినట్లు తెలిపింది. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నదని పేర్కొంది. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని వెల్లడించింది.

కాగా, ఈ నెల ఆరంభంలో శ్రీనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది చనిపోయాడు. అతడు గగన్‌గిర్‌, గందేర్బల్‌ ప్రాంతాల్లో సాధారణ పౌరులను హత్యలతోపాటు పలు ఉగ్ర దాడుల్లో పాల్గొన్నాడని అధికారులు వెల్లడించారు.

నవంబర్‌లో కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జెసిఓ) ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల ఇద్దరు గ్రామ రక్షణ దళాల హత్యకు కారణమైన ఉగ్రవాదుల బృందాన్ని సైన్యం, పోలీసుల సంయుక్త శోధన బృందాలు అడ్డుకున్నప్పుడు కేశ్వాన్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ముగ్గురు సైనికులు కూడా గాయపడ్డారు. 

బారాముల్లా జిల్లాలో భద్రతా దళాలతో రాత్రిపూట జరిగిన ఎన్‌కౌంటర్‌లో నవంబర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు కూడా మరణించారు. వారి గుర్తింపును   నిర్ధారిస్తున్నామని కాశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.