అధిక సుంకాలపై భారత్ కు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక!

అధిక సుంకాలపై భారత్ కు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక!
మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపటనున్నారు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల విషయంపై మాట్లాడారు. అమెరికా వస్తువులపై అధిక సుంకాలు విధించే భారత్ సహా ఇతర దేశాలపై ప్రతీకార పన్ను విధించే యోచనలో ఉన్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. విలేకరులతో మాట్లాడుతూ ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై పన్ను విధిస్తే అమెరికా దీటుగా స్పందిస్తుందని హెచ్చరించారు.
 
అమెరికా ఉత్ప‌త్తులపై భారీగా దిగుమ‌తి సుంకాన్ని భార‌త్ వ‌సూల్ చేస్తున్న‌ద‌ని, దానికి ప్ర‌తీకారంగా మేం కూడా పన్నును వ‌సూలు చేయ‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. భారత్ తో పాటు బ్రెజిల్ కూడా త‌మ ఉత్ప‌త్తుల‌పై అధిక దిగుమ‌తి సుంకాన్ని వ‌సూల్ చేస్తున్న‌ట్లు ట్రంప్ ఆరోపించారు. ‘వారు మాకు పన్ను వేస్తే, మేం వారికి అదే మొత్తంలో పన్ను విధిస్తాం. వారు మాకు పన్ను విధిస్తారు. వాటిపై మేం పన్ను విధిస్తాం. దాదాపు అన్ని సందర్భాల్లోనూ వారు మాపై పన్ను విధిస్తున్నారు. మేము వారిపై పన్ను విధించడం లేదు’ అని ట్రంప్ తెలిపారు.

అమెరికా మీద భారత్, బ్రెజిల్ వంటి దేశాలు అత్యధిక పన్ను విధిస్తున్న అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. 100, 200 శాతం పన్ను విధిస్తున్నారని, దేనికైనా ప్రతీకార చర్య ఉంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ భారత్ వంద శాతం పన్ను విధిస్తే.. తాము కూడా వేస్తాం కదా? అని ప్రశ్నించారు. దేశాలు ఎలా పన్ను విధిస్తాయో తాము  కూడా అలాగే వసూలు చేస్తామని స్పష్టం చేశారు. గతంలో భారత్‌ను ట్రంప్ టారీఫ్ కింగ్ అని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

‘పరస్పరం అనే పదం ముఖ్యమైనది ఎందుకంటే ఎవరైనా మాకు పన్ను విధిస్తే మేం విధిస్తాం. భారత్ మాకు 100 శాతం ఛార్జీలు వసూలు చేస్తే మేము వారికి వసూలు చేయలేమా? వారు పంపుతారు. మేం వారికి పంపుతాం.’ అని ట్రంప్ చెప్పారు. చైనాతో వాణిజ్య ఒప్పందంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

అయితే కొన్ని అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్, బ్రెజిల్ కూడా ఉన్నాయని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై వాణిజ్య కార్యదర్శిగా ఎన్నికైన హోవార్డ్ లుట్నిక్ కూడా మరోసారి ప్రస్తావించారు. కొత్త పరిపాలనలో వాణిజ్య విధానాలలో పరస్పర చర్య తప్పకుండా ఉంటుందని లుట్నిక్ పేర్కొన్నారు. మీరు మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారనేదే ముఖ్యమని స్పష్టం చేశారు.

అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన ఉత్పత్తులపై కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపు లేదా రాయితీలు ఇచ్చేందుకు అమెరికా జీఎస్పీ తెచ్చింది. అయితే ఆ హోదా వల్ల భారత మార్కెట్లలోకి సమాన, హేతుబద్ధ సంధానత లభించలేదని అప్పట్లో ట్రంప్‌ ఆరోపించారు. ఈ హోదాను పునరుద్ధరణకు ఇరుదేశాల మధ్య చర్చలు చర్చలు జరుగుతున్నాయి.

ఇదిలావుండగా, పదవీ విరమణ చేస్తున్న బైడెన్ ప్రభుత్వం మంగళవారం భారత్ అమెరికా సంబంధాల గురించి మాట్లాడింది. బైడెన్‌ పాలనలో ఇరుదేశాల మధ్య బంధం మరింత బలపడిందని పేర్కొంది. ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా దీన్ని కొనసాగించాలని ఆశాభావం వ్యక్తంచేసింది. భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వాత్రాతో భేటీ సందర్భంగా అమెరికా విదేశాంగశాఖ డిప్యూటీ సెక్రటరీ కర్ట్‌ కాంప్‌బెల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘అమెరికా-భారత్ సంబంధాలపై మేం చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నాం. డెలావేర్లో జరిగిన క్వాడ్ శిఖరాగ్ర సమావేశంతో గత కొన్ని నెలలుగా మేం చాలా ఉన్నత స్థాయిగా ఉన్నాం.’ అని కాంప్‌బెల్‌ వాషింగ్టన్ లో కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా విలేకరులతో చెప్పారు.