కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష కేంద్రాలు ప్రభుత్వ సంస్థల్లోనే

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష కేంద్రాలు ప్రభుత్వ సంస్థల్లోనే
 
* వచ్చే ఏడాది ఎన్‌టీఏ ప్రక్షాళన

కంప్యూటీ ఆధారిత పరీక్షల(సీబీటీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చీఫ్‌ ఆర్‌.రాధాకృష్ణన్‌ నేతృత్వంలో నియమించిన కమిటీ కీలక సూచనలు చేసింది. ఈ కమిటీ నివేదిక మంగళవారం మీడియాకు విడుదలైంది. సీబీటీ పద్ధతిలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్న జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) ఇకపై పకడ్బందీగా వ్యవహరించాలని, డిజీ-యాత్ర మాదిరిగా ‘డిజీ-పరీక్షల వ్యవస్థ’ను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. 

ఇందుకోసం ఎన్‌టీఏలో డైరెక్టర్ల స్థాయిలో ప్రక్షాళన అవసరమని పేర్కొంది. సాంకేతికత, ఉద్పాదకత, ఆపరేషన్స్‌, సైబర్‌ భద్రత, నిఘా విభాగాలను ఏర్పాటు చేసి, ఎన్‌టీఏను బలోపేతం చేయాలని స్పష్టం చేసింది. ఇకపై సీబీటీలను ప్రైవేటు కేంద్రాల్లో కాకుండా ప్రభుత్వ సంస్థల్లోనే నిర్వహించాలని సూచించింది.

‘‘ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను వినియోగించుకోవాలి. అక్కడ సీబీటీకి సంబంధించిన వనరులను సమకూర్చాలి. కనీసం 400-500 కేంద్రాలను ప్రభుత్వ సంస్థల్లో ఏర్పాటు చేయాలి. ఇందుకోసం ఏడాది సమయం తీసుకోవచ్చు. దశల వారీగా ఈ పనిని పూర్తిచేయాలి’’ అని రాధాకృష్ణన్‌ కమిటీ తన నివేదికలో సిఫారసు చేసింది. 

అంతేకాదు గ్రామీణ ప్రాంతాలకూ సీబీటీని విస్తరించాలని, ప్రవేశ పరీక్షల విషయంలో మారుమూల ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు దూరాభారాన్ని తగ్గించాలని పేర్కొంది. ఇందుకోసం మొబైల్‌ టెస్టింగ్‌ కేంద్రాలను(ఎంటీసీ) ఏర్పాటు చేయాలని, వీటిల్లో 30-50 మంది విద్యార్థులు పరీక్షలు రాసే వనరులను సమకూర్చాలని తెలిపింది.

కాగా, వచ్చే ఏడాది నుంచి కొన్ని తరగతులకు సంబంధించిన ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాల ధరలు తగ్గుతాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. ఏటా 5 కోట్ల పాఠ్య పుస్తకాలను ముద్రిస్తున్న ఎన్‌సీఈఆర్‌టీ వచ్చే ఏడాది నుంచి ఆ సామర్థ్యాన్ని 15 కోట్లకు పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో పాఠ్య పుస్తకాల కొరత తీరుతుందని స్పష్టం చేశారు. 

నూతన విద్యా విధానాన్ని అనుసరించి 9-12 తరగతులకు రూపొందించిన పాఠ్య పుస్తకాలు 2026-27 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాలు అన్ని షెడ్యూల్డ్‌ భారతీయ భాషల్లో ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కాగా.. సీబీఎ్‌సఈకి అనుబంధంగా ఉండే పాఠశాలల సంఖ్య రెట్టింపు(2014లో 14,974 ఉండగా 2024కల్లా.. 30,415కు చేరుకున్నాయి) అయినట్లు ధర్మేంద్ర ప్రధాన్‌ వివరించారు.

వచ్చే ఏడాది ఎన్‌టీఏను సమూలంగా ప్రక్షాళన చేస్తామని ధర్మేంద్ర ప్రధాన్‌  ప్రకటించారు. నీట్‌, యూజీసీ-నెట్‌లలో ప్రశ్నపత్రాల లీకేజీ అనుమానాలు వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఇకపై పకడ్బందీగా పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. పేపర్‌-పెన్‌/ఓఎంఆర్‌ కాకుండా.. ప్రవేశ పరీక్షలన్నీ సీబీటీ విధానంలో జరుగుతాయని చెప్పారు. 

నీట్‌ విషయంలో ఓఎంఆర్‌ విధానమా? సీబీటీనా? అనే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఎన్‌టీఏ ఇకపై ఎలాంటి రిక్రూట్‌మెంట్‌ పరీక్షలను నిర్వహించదని, కేవలం ప్రవేశ పరీక్షలకే పరిమితమవుతుందని స్పష్టం చేశారు. సీయూఈటీ-యూజీని ఏడాదికి ఒకసారే నిర్వహిస్తారని చెప్పారు. పలు సంస్థల(స్వయం పోర్టల్‌ వంటి కోర్సులు) కోసం ఎన్‌టీఏ పరీక్షలు నిర్వహించడం వల్ల ఆ సంస్థపై ఎక్కువ భారం పడుతోందని వివరించారు.