
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 38 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా టెస్టు ముగిసిన అనంతరం రవిచంద్రన్ అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మీడియా ముందుకు వచ్చిన అశ్విన్ టీమిండియా క్రికెటర్గా తనకు ఇదే చివరి రోజని వెల్లడించాడు.
వర్షం కారణంగా గబ్బా టెస్టుకు అంతరాయం ఏర్పడింది. దీంతో భారత ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్లోకి చేరారు. అయితే ఈ సమయంలో డ్రెస్సింగ్ రూమ్లో రవిచంద్రన్ అశ్విన్ విరాట్ కోహ్లీతో చాలాసేపు చర్చించాడు. అయితే అప్పుడే తన నిర్ణయాన్ని అశ్విన్ విరాట్కు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కోహ్లీ కూడా రవిచంద్రన్ అశ్విన్ను హగ్ చేసుకున్నాడు. అపుడు అశ్విన్ భావోద్వేగానికి గురయ్యాడు. అనంతరం మ్యాచ్ ముగిశాక అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
“భారత క్రికెటర్గా అన్ని ఫార్మాట్లకు ఇదే నా చివరి రోజు. నా కెరీర్లో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, పుజారాలు ఎక్కువగా క్యాచ్లు పట్టి నా వికెట్ల సంఖ్యను పెంచినందుకు ధన్యావాదాలు. రిటైర్మెంట్ గురించి ఇప్పుడు నేను ప్రశ్నలకు సమధానాలు ఇవ్వాలనుకోవడం లేదు. ఇది నాకు భావోద్వేగమైన క్షణం. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే స్థితిలో నేను ఇప్పుడు లేను. అర్థం చేసుకోండి,” అని విలేకరుల సమావేశంలో రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు.
కాగా అశ్విన్ 2010లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ సత్తాచాటాడు. టీమిండియా తరఫున 287 మ్యాచ్లు ఆడిన అశ్విన్ మొత్తంగా 765 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 6 సెంచరీలు సహా 4,394 అంతర్జాతీయ పరుగులు చేశాడు.
కాగా అశ్విన్ తన కెరీర్లో 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో అత్యధికంగా 537 వికెట్లు తీశాడు. వన్డేల్లో 156, టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పినప్పటికీ అశ్విన్.. ఐపీఎల్ ఆడనున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టు బుధవారం డ్రాగా ముగిసింది.
రిటైర్మెంట్ ప్రకటించిన ఆ స్టార్ స్పిన్నర్పై మేటి బ్యాటర్ విరాట్ కోహ్లీ 14 ఏళ్ల నీతో కలిసి ఆడానని, రిటైర్ అవుతున్నట్లు ఇవాళ చెప్పగానే కాస్త భావోద్వేగానికి లోనైట్లు ఎక్స్ లో పేర్కొన్నాడు. నీతో కలిసి ఆడిన ఆ క్షణాలన్నీ గుర్తు వచ్చినట్లు చెప్పాడు. నీతో సాగిన జర్నీలో ప్రతి సందర్భాన్ని ఎంజాయ్ చేసినట్లు కోహ్లీ తెలిపాడు. నీ నైపుణ్యం, మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యాన్నిఅద్భుతమని తెలిపాడు. భారత క్రికెట్లో నిన్నొక లెజెండ్గా గుర్తిస్తారని స్పష్టం చేశాడు.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?