
లోక్సభతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒకే దేశం – ఒకే ఎన్నిక బిల్లు తీసుకురావాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి సిఫార్సులు తీసుకుంది. ఆ తర్వాత జమిలి ఎన్నికల అమలుకు సంబంధించి రెండు బిల్లులను రూపొందించింది.
ఈ బిల్లులకు ఇటీవలె కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్లమెంటు ముందుకు తీసుకువచ్చేందుకు మార్గం సుగమం అయింది. ఈ క్రమంలోనే సోమవారం ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నారు. జమిలి ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఈనెల 16వ తేదీన లోక్సభ ముందుకు తీసుకురానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద అర్జున్రామ్ మేఘ్వాల్ జమిలి ఎన్నికల బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక దేశంలోని 3 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్టాలను రాజ్యాంగ సవరణ బిల్లుతో అనుసంధానించేందుకు చట్టాలను సవరించడానికి ఒక సాధారణ బిల్లుతో పాటు మరో ముసాయిదా చట్టాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఒక రాజ్యాంగ సవరణ బిల్లు, మరో సాధారణ బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలకు సంబంధించిన చట్టాలను సవరించేందుకు సాధారణ బిల్లును కేంద్రం తీసుకువస్తోంది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతోపాటే స్థానిక ఎన్నికలనూ నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది.
ఇందుకోసం రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టాలని కమిటీ సూచించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని ప్రస్తుతానికి పక్కనబెట్టిన కేంద్ర ప్రభుత్వం. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలపై తీసుకువచ్చిన బిల్లులకు ఆమోదం కల్పించింది. ఇందుకోసం 50 శాతం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇక స్థానిక సంస్థల ఎన్నికలను కూడా వాటితో కలిపి నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణతోపాటు 50 శాతం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించేందుకు మూడింట రెండొంతుల మంది సభ్యులు మద్దతు పలకాల్సి ఉంటుంది. అయితే అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి అంత బలం లేకపోవడంతో ఇండియా కూటమిలోని పార్టీల మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
అయితే ఇది ఎలా సాధ్యం అవుతుంది అనేది బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత తేలనుంది. 542 మంది సభ్యులు ఉన్న లోక్సభలో ఎన్డీఏకు 293 మంది ఎంపీలు ఉండగా.. ఇండియా కూటమికి 235 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 361 మంది ఎంపీల మద్దతు అవసరం కానుంది.
ఇక ఈ బిల్లులపై సమగ్ర చర్చ జరగాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం వాటిని పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీ ద్వారానే రాష్ట్రాల స్పీకర్లతో సంప్రదింపులు జరపాలని భావిస్తోంది.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం