గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్లో తీవ్ర హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. హిందూ ఆలయాలు, హిందువులపై తీవ్రంగా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ పోరాటం కొనసాగిస్తుండగా ఆయనను ఇటీవలె దేశద్రోహం కేసులో అరెస్ట్ చేయడం ఇంకాస్త ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఈ నేపథ్యంలోనే ఇస్కాన్ ప్రతినిధులు కూడా హిందువులపై హింసను ఆపాలని ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ బంగ్లాదేశ్లో ఉన్న ఇస్కాన్ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఢాకాలోని ఇస్కాన్ ఆలయంపై దాడి జరిగినట్లు ఇస్కాన్ కోల్కతా ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ వెల్లడించారు.
ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ తర్వాతా బంగ్లాదేశ్లో పరిస్థితులు మరింత తీవ్రతరం అవుతున్నాయి. తాజాగా శనివారం తెల్లవారుజామున బంగ్లాదేశ్లోని మరో ఇస్కాన్ కేంద్రంపై దుండగులు దాడి చేసినట్లు ఇస్కాన్ కోల్కతా ప్రతినిధి తెలిపారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న ఇస్కాన్ కేంద్రం, మరో ఆలయంపై ఆగంతకులు దాడి చేసి, నిప్పు పెట్టినట్లు చెప్పారు.
శనివారం తెల్లవారుజామున 2-3 గంటల సమయంలో నామ్హట్టాలో ఇస్కాన్ కేంద్రం పరిధిలోని రాధా కృష్ణ దేవాలయం, మహాభాగ్య లక్ష్మీ నారాయణ ఆలయానికి దుండగులు నిప్పు పెట్టినట్లు తెలిపారు. ఆలయం పైకప్పులను తొలగించి లోపల పెట్రోల్ పోసి నిప్పంటించారని చెప్పారు. దీంతో విగ్రహాలతోపాటు ఇతర వస్తువులు మంటల్లో కాలి ధ్వంసమయ్యాయని ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు.
ఈ దాడిలో ఇస్కాన్ కేంద్రం పూర్తిగా ధ్వంసం అయిందని రాధారమణ్ దాస్ తెలిపారు. ఇప్పటికైనా ఈ దాడులు ఆగేలా మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.
బంగ్లాదేశ్లో మొదలైన విద్యార్థి ఉద్యమంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఢాకా నుంచి పారిపోయి భారత్కు వచ్చి తలదాచుకుంటున్న వేళ అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత జరిగిన అల్లర్లలో హిందువులపై తీవ్ర దాడులు జరుగుతున్నాయి.
బంగ్లాదేశ్లో ఇస్కాన్ ప్రచారకర్తగా ఉన్న చిన్మయ్ కృష్ణదాస్ గత నెలలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొని బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఢాకా ఎయిర్పోర్టులో చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్ట్ చేసిన పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ లాయర్ ప్రాణాలు కోల్పోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో బంగ్లాదేశ్లో ఇస్కాన్ కార్యకలాపాలపై నిషేధం విధించాలని ఓ లాయర్ పిటిషన్ వేయగా ఢాకా హైకోర్టు కొట్టివేసింది.
చిన్మయ్ కృష్ణదాస్ తరఫున వాదించడానికి కోర్టుకు వచ్చిన ఓ లాయర్ను స్థానికంగా ఆందోళన చేస్తున్న వారు తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు. మరో లాయర్ను కోర్టు ప్రాంగణంలోకి అనుమతించలేదు. దీంతో చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్ను నెల రోజుల పాటు కోర్టు వాయిదా వేసింది. ఇక బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లపై బ్రిటన్ స్పందించింది. బంగ్లాదేశ్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రద్దీ ప్రాంతాలు, మతపరమైన భవనాలు, రాజకీయ ర్యాలీలు, పర్యాటక ప్రాంతాల్లో ఉగ్రవాదులు భారీ దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని హెచ్చరించింది.

More Stories
లుధియానాలో అక్రమ బంగ్లాదేశీయులపై పోస్ట్ కు అరెస్ట్!
పాక్ అధికారులపై ఆంక్షలు.. అమెరికా కాంగ్రెస్ సభ్యుల వినతి
గంగ, ఓల్గా నదుల స్ఫూర్తి భారత్- రష్యాలకు మార్గనిర్ధేశం