కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిందని బిజెపి సీనియర్ నేత, మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్ విమర్శించారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇంతత్వరగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. ఏడాది పాలనలోనే ప్రజలు విసిగిపోయారని, ఈ ప్రభుత్వాన్ని భరించే స్థితిలో లేరని చెప్పారు. 

కూల్చివేతలు, భూములు లాక్కోవడమే అజెండాగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదలు, మధ్య తరగతి వర్గాల ప్రజలు ప్రభుత్వ తీరుతో తీవ్ర అసహనంతో ఉన్నారని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉండడం వల్ల అన్ని వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు.

 ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలని రాజేందర్ హితవు పలికారు. భయపెట్టడం, ఎదురు దాడి చేయడం, డైవర్షన్ రాజకీయాలు చేయడం తప్ప ఈ ముఖ్యమంత్రికి ఇంకేమి చేతకాదని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం మానుకోవాలని, భాషను ఇకనైనా మార్చుకుని సిఎం హోదాకు తగ్గట్లుగా వ్యవహరించాలని హితవు పలికారు.

 ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మరే హామీ అమలు కాలేదని విమర్శించారు. రూ.4 వేల నెలవారీ పింఛన్ మొదలుకుని ఇచ్చిన హామీలన్నింటికి ఎగనామం పెట్టారని ఈటల ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీల అమలు అయ్యే అవకాశం లేదని ఎంపి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆదాయానికి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుకు పొంతనే లేదని స్పష్టం చేశారు.

పేదల ఇండ్లు కూల్చడం, భూములు లాక్కోవడం తప్ప మిగిలిన అజెండా ప్రభుత్వానికి లేదని చురకలంటించారు. ఎప్పుడు తమ ఇండ్లు కూల్చుతారో, భూములు లాక్కుంటారోననే భయంతో ప్రజలు కాలం నెట్టుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని పేర్కొన్నారు.

భూములను గుంజుకోవడం తప్ప మరో పని లేకుండా పోయిందని విమర్శించారు. పేదల భూములు గుంజుకునే ప్రభుత్వంగా ముద్రపడింది తప్ప పేదల అవసరాలు తీర్చే ప్రభుత్వంగా పేరుతెచ్చుకోలేదని తెలిపారు. హైడ్రా పేరుతో ప్రజలను భయకంపితులను చేయడం తప్ప చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ నది ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లను కూలగొట్టడం ఏమిటని ప్రశ్నించారు. 

ముచ్చర్లలో గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం 14 వేల ఎకరాల భూసేకరణ చేసిందని పేర్కొంటూ ఆ రోజుల్లో ఫార్మాసిటీని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ రద్దు చేసి ఆ భూములను ఆయా రైతులకు తిరిగి ఇస్తామని చెప్పిన సంగతిని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేయకుండా ఫోర్త్ సిటీ పేరుతో మరో 16 వేల ఎకరాలను సేకరించాలని ప్రయత్నించడం దారుణమని ధ్వజమెత్తారు.