
ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని పలువురు పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి, ఆ తర్వాత ఎన్కౌంటర్ చేశారనే ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో మావోయిస్టులపై విష పదార్థాలను ప్రయోగించామనేది దుష్ప్రచారమని డిజిపి జితేందర్ కొట్టిపారేసారు. మావోయిస్టులు స్పృహ కోల్పోయాక కాల్పులు జరుపామనడం అవాస్తవమని, మావోయిస్టులు అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరిపారని తేల్చి చెప్పారు. పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారని, పోలీసుల కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారని చెప్పారు.
హైకోర్టు, ఎన్హెచ్ఆర్సీ సూచనల మేరకే శవ పరీక్షలు నిర్వహించామని, ఎన్కౌంటర్ కేసు దర్యాప్తు అధికారిగా వేరే జిల్లా డీఎస్పీని నియమించినట్లుగా వివరించారు. కాగా, ఎన్కౌంటర్పై హైకోర్టులో పిటిషన్ పౌరహక్కుల సంఘం నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. భోజనంలో మత్తుపదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని, చిత్రహింసలకు గురిచేసి కాల్చిచంపారని న్యాయస్థానానికి తెలిపారు.
మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలు ఉన్నాయని న్యాయవాది కోర్టులో వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. అలాగే మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని తెలిపింది. ఈ విషయంపై తదుపరి విచారణను మంగళవారంకు హైకోర్టు వాయిదా వేసింది.
అయితే, ఆదివారం తెల్లవారు జామున ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఓ మహిళా మావో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నర్సంపేట-ఇల్లందు ఏరియా కమిటీ కార్యదర్శి కుర్సం మంగు అలియాస్ భద్రు, ఏటూరునాగారం-మహాదేవ్పూర్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు సైతం ఉన్నారు. మధు స్వస్థలం పెద్దపల్లి జిల్లా రాణాపూర్ కాగా, మిగతా ఆరుగురు ఛత్తీస్గఢ్ జిల్లాకు చెందిన వారే.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు