దక్షిణాదిన ఓ పార్లమెంట్ సమావేశం జరపాలి

దక్షిణాదిన ఓ పార్లమెంట్ సమావేశం జరపాలి

దేశ రాజధాని న్యూఢిల్లీలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు సభ్యుల పనితీరును ప్రభావితం చేస్తున్నాయని, ఈ నేపథ్యంలో దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రానికి తిరుపతి ఎంపీ, వైఎస్ఆర్‌సీపీ నేత డా. మద్దిల గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజజుకి ఎంపీ గురుమూర్తి ఆదివారం లేఖ రాశారు. 

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆలోచనలు అనే పుస్తకంలో ఈ అంశాన్ని ప్రస్తావించారని ఆయన రాసిన లేఖలో ప్రస్తావించారు. 1968లో లోక్‌సభలో స్వతంత్ర సభ్యుడు ప్రకాశ్ వీర్ శాస్త్రి ప్రైవేట్ మెంబర్ బిల్లు సైతం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం వల్ల జాతీయ సమగ్రత మరింత పెరుగుతుందని ఆయన తెలిపారు. 

వాతావరణ ప్రతికూలతలు లేక పోవడం వల్ల పార్లమెంట్‌లో ఉత్పాదకత కూడా పెరుగుతుందని ఆయన పేర్కొ్న్నారు. పార్లమెంట్ ఉభయ సభలు ఏడాదికి మూడు సార్లు సమావేశమవుతాయి. జనవరి నెలాఖరున బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. మధ్యలో కొన్నాళ్లు విరామంతో రెడు విడతలుగా సమావేశాలు సాగుతాయి. జులై – ఆగస్ట్ మాసాల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయి. 

నవంబర్ – డిసెంబర్ నెలల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహిస్తారు. అయితే ఈ మూడు సమావేశాల్లో కనీసం ఒకటైనా దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని చాలా కాలంగా పలువురు దక్షిణాది ఎంపీలు తమ తమ రాజకీయ పార్టీలను విస్మరించి డిమాండ్ చేస్తున్నారు. ఇక రాజధాని ఢిల్లీలో చలి కాలంలో చలి, వేసవి వేడి భరించలేని స్థాయిలో ఉంటాయి. 

అలాగే వర్షాకాల సమావేశాల్లో తీవ్ర ఉక్కపోతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే విధంగా శీతాకాల సమావేశాల సమయలో తీవ్ర చలితో పాటు ప్రాణాంతక స్థాయిలో వాయు కాలుష్యం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఈ పార్లమెంట్ సమావేశాలు దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని డిమాండ్ మళ్లీ తెర మీదకు వచ్చింది. 

ఆ క్రమంలోనే తాజాగా వైసీపీ ఎంపీ డా. మద్దిల గురుమూర్తి ఈ ప్రతిపాదన తన ఎక్స్ ఖాతా వేదికగా చేశారు. దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం వల్ల జాతీయ సమైక్యత మరింత పెంపొందుతుందని ఆయన తెలిపారు. ఇంకోవైపు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తేందుకు ఎంపీ గురుమూర్తి ప్రయత్నిస్తున్నారు. జీరో అవర్‌‌లో చర్చ కోరుతూ ఆయన నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

కాగా, గురుమూర్తి ప్రయత్నాన్ని తెలంగాణలోని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వాగతించారు. ఈ అంశంపై తమ పార్టీ అధిష్టానంతో చర్చించి తాను సైతం తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.