`కాంగ్రెస్ గ్యారంటీల గారడీ’.. 6 గ్యారంటీలు.. 66 మోసాలు

`కాంగ్రెస్ గ్యారంటీల గారడీ’.. 6 గ్యారంటీలు.. 66 మోసాలు

* ఏడాది కాంగ్రెస్ పాలనపై తెలంగాణ బీజేపీ ఛార్జ్ షీట్

కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనకు ఏమాత్రం తేడా లేదని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ‘కాంగ్రెస్ గ్యారంటీల గారడీ’.. 6 గ్యారంటీలు.. 66 మోసాలు పేరుతో బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. 24X7 దగా.. ఇదీ తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలన.. అంటూ విమర్శించింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ  కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు.
 
గత సంవత్సరం కాలంగా మార్పు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలి.. కాంగ్రెస్ కావాలి అనే నినాదంతో ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి ఏడాది పూర్తి అయ్యింది. తెలంగాణ ప్రజలు గత సంవత్సరకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో కంటే ఎక్కువ కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.

పాలకులు మారిన పాలనా విధానం మారలేదు అన్నట్టు తెలంగాణ ప్రజలు మార్పు కోసం ఓటేశారు కానీ కాంగ్రెస్ గ్యారంటీల గారడీనీ ఏడాదిలోనే తెలుసుకున్నారని స్పష్టం చేశారు.  తెలంగాణ మొత్తం కాంగ్రెస్ గ్యారంటీల గారడి.. 6 అబద్ధాలు.. 66 మోసాల పేరిట ప్రజలను బీజేపీ పార్టీ చైతన్యం చేయనుందని వెల్లడించారు.
 
‘‘కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలను చేసి అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చడం లేదు. వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని, ఏడాది గడిచినా పూర్తి చేయలేకపోతోంది. ప్రజా సమస్యలను పరిష్కరించని ఈ ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ప్రజలు నివ్వెర పోతున్నారు’’ అని కిషన్ రెడ్డి విమర్శించారు.
 
గ్యారంటీలు, హామీలు, డిక్లరేషన్ల పేరుతో మాయమాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్ర స్థాయిలో బీజేపి పార్టీ ఎండగడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 9న అందరికీ రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది కానీ ఏడాది గడిచినా రుణమాఫీ పూర్తి కాలేదని ఆయన గుర్తు చేశారు. 
 
రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామని చెప్పాన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రైతు భరోసా ఇవ్వలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. పదేళ్లపాటు నియంతృత్వపాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన సాగిందని విమర్శించారు.

నిరంకుశ, అవినీతి పాలనను పదేళ్ల తర్వాత ప్రజలు గద్దె దించారని చెబుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడాలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని కత్రియ హోటల్ వేదికగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్ షీట్ ను విడుదల చేసే కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ, ఎంపీలు రఘునందన్ రావు,  ఈటెల రాజేందర్, నగేశ్, బీజేపీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, రామారావు పాటిల్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీశ్, పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ నేతుల పాల్గొన్నారు.