మరికొన్ని రోజుల్లో పదవి నుంచి దిగిపోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్కు భారీ ఊరట కల్పించారు. రెండు క్రిమినల్ కేసుల్లో హంటర్కు బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించారు. తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్టు ఈ సందర్భంగా బైడెన్ పేర్కొన్నారు.
అక్రమంగా తుపాకీ కొనుగోలు, ఆదాయపు పన్ను విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని డెలావెర్, కాలిఫోర్నియాలో హంటర్పై కేసులు నమోదయ్యాయి. ఆయుధం కొనుగోలు వ్యవహారంలో నమోదైన కేసులో హంటర్ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. అయితే, ఇప్పటి వరకూ శిక్ష మాత్రం ఖరారు చేయలేదు.
దీనిపై అప్పట్లో బైడెన్ స్పందిస్తూ హంటర్ దోషిగా తేలిన సమయంలో క్షమాభిక్షకు యత్నించబోనని స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రం అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే సమయంలో కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశాన్ని వినియోగించుకున్నారు. బైడెన్ నిర్ణయం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
కాగా, ఈ ఏడాది నవంబర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20న రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బైడెన్ నిర్ణయం పూర్తిగా న్యాయవిరుద్ధమని, బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు.
ఈ మేరకు తన ట్రూత్ సోషల్లో ట్రంప్ ఓ పోస్ట్ పెట్టారు. ‘హంటర్కు క్షమాభిక్ష ప్రసాదించినట్లే ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న జే-6 బందీలకు ఎందుకు ఉపశమనం కల్పించలేదు..? కుమారుడి విషయంలో బైడెన్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా న్యాయవిరుద్ధం, అధికార దుర్వినియోగం’ అని ట్రంప్ పోస్ట్ పెట్టారు.
జే-6 బందీలు అంటే 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్లో ట్రంప్ తరఫున అల్లర్లలో పాల్గొన్నవారు. బైడెన్ విజయాన్ని ధ్రువీకరించేందుకు వాషింగ్టన్ క్యాపిటల్ భవనంలో కాంగ్రెస్ సమావేశమైన సమయంలో ట్రంప్ మద్దతుదారులు వేలాదిగా క్యాపిటల్ భవనంలోకి దూసుకొచ్చి విధ్వంసం సృష్టించారు. ఈ దాడిలో 140 మందికిపైగా పోలీసు అధికారులు గాయపడ్డారు.

More Stories
ప్రజల కేంద్రీకృత మార్పులకై వాతావరణ సదస్సులో భారత్ పిలుపు
రక్షణ వ్యయం పెంపుపై జి7 దేశాల మధ్య విబేధాలు
ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తే స్వదేశంకు హసీనా సిద్ధం!