దేశ ప్రజలే వారికి సరైన శిక్ష విధిస్తారు

దేశ ప్రజలే వారికి సరైన శిక్ష విధిస్తారు
 

* తొలిరోజే పార్లమెంట్ సమావేశాలు వాయిదా

రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  గుర్తు చేశారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంట్‌ వెలుపల మీడియా పాయింట్‌ వద్ద ప్రధాని మాట్లాడుతూ విపక్ష ఇండియా కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  ప్రజలచే తిరస్కరణకు గురైన కొందరు గూండాయిజం ద్వారా పార్లమెంట్‌ ను నియంత్రించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశ ప్రజలు వారి చర్యలన్నింటినీ లెక్కిస్తారని, సరైన సమయంలో శిక్ష విధిస్తారని ప్రధాని హెచ్చరించారు.
 
మహారాష్ట్ర, యూపీలో బంపర్‌ విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి పార్లమెంట్‌ సమావేశాలకు హాజరవుతూ శీతాకాల సమావేశాలు కావడంతో వాతావరణం చల్లగా ఉంటుందని ప్రధాని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. విపక్షాలపై విరుచుకుపడిన ప్రధాని మోదీ, కొద్దిమంది వ్యక్తులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ప్రస్తావించారు. ఆ వ్యక్తులు తమ బాధ్యతలను అస్సలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

‘కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు. ప్రజలచే తిరస్కరణకు గురైన కొందరు గూండాయిజం ద్వారా పార్లమెంటుపై నియంత్రణకు ప్రయత్నిస్తున్నారు. సొంత లబ్ధి కోసం పార్లమెంటు సమావేశాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేశ ప్రజలు వారి చర్యలన్నింటినీ లెక్కిస్తారు. సరైన సమయంలో ప్రజలే శిక్ష విధిస్తారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పార్లమెంట్‌లో సానుకూల చర్చలు జరగాలని కోరుకుంటున్నట్లు మోదీ తెలిపారు. ఈ పార్లమెంట్‌ సమావేశాలు ఎన్నో అంశాలపరంగా ముఖ్యమైనవని ప్రధాని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నవంబర్‌ 26 నాటికి 75వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నామని, దానికి గుర్తుగా రేపు సంవిధాన్‌ సదన్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రాజ్యాంగ అమలు ఉత్సవాలు ఐక్యంగా నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

కాగా, అదానీ అంశంపై చర్చించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో పార్లమెంట్ ఉభయ సభలు తొలి రోజే బుధవారానికి వాయిదా పడ్డాయి. మంగళవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సభలు జరుగవు.  తొలుత ఇటీవలేకాలంలో మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపాయి. ఆ తర్వాత లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడ్డాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ ఓంబిర్లా సభను బుధవారానికి వాయిదా వేశారు.

అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. దీంతో ఎగువ సభను చైర్మన్‌ ధన్‌కర్‌ బుధవారానికి వాయిదా వేశారు. ఉభయ సభలు బుధవారం ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 20 వరకు