యూనిఫామ్‌లో రెచ్చిపోతరా.. బాధితులకు ఎన్‌హెచ్‌ఆర్సీ భరోసా

యూనిఫామ్‌లో రెచ్చిపోతరా.. బాధితులకు ఎన్‌హెచ్‌ఆర్సీ భరోసా
‘బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తాం. ఎవరూ భయపడొద్దు. స్వేచ్ఛగా జీవించాలి’ అని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) డిప్యూటీ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ లా ముకేశ్‌ భరోసా ఇచ్చారు. భూసేకరణ ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే జరుగుతుందని, ఎవరూ భయపడొద్దని భరోసా ఇచ్చారు. 
 
యూనిఫామ్‌ ఉన్నదని ప్రజలపై అధికారాన్ని చలాయించొద్దని, వారిని భయాందోళనకు గురిచేయొద్దని పోలీసులకు సూచించారు. ఇకనుంచి పోలీసులు గ్రామాలకు రారని చెప్పారు. వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం రోటిబండతండాలో శనివారం ఆయన బాధిత కుటుంబాలను కలిశారు. ఈ నెల 11న జరిగిన ఘటన, అనంతర పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులను అడిగి వివరాలను నమోదు చేసుకున్నారు. 
 
లగచర్ల ఘటనపై బాధిత కుటుంబాలు, రైతుల ఫిర్యాదు మేరకు తాము ఢిల్లీ నుంచి వచ్చినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. బాధితుల నుంచి సేకరించిన వివరాలను ప్రభుత్వ దృష్టికి తీకెళ్తామని చెప్పారు. ఆయన వెంట ఎన్‌హెచ్‌ఆర్సీ ఇన్‌స్పెక్టర్లు రోహిత్‌ సింగ్‌, యతీప్రకాశ్‌శర్మ ఉన్నారు. 
 
అధికారులపై దాడిలో నిందితులుగా ఉన్నవారు పోలీసులకు లొంగిపోతే అందరికీ బెయిల్‌ మంజూరయ్యే అవకాశం ఉంటుందని సూచించారు.ఇప్పటికే లగచర్ల దాడిపై 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్‌, డీజీపీకి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కలెక్టర్ లగచర్ల గ్రామానికి వచ్చినప్పుడు ఏం జరిగిందని, అధికారులపై దాడి, ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేసిన తీరును కమిషన్ అధికారులు స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు తమపై చేపట్టిన దౌర్జన్యాలను స్థానికులు వివరిస్తూ కమిషన్‌ ముందు వారి గోడు వెల్లబోసుకున్నారు.

‘పోలీసులు మగవారు లేని ఇండ్లలోకి చొరబడి మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారు. కరెంటు తీసేసి ఊరు లోపలికి వచ్చి దాడి చేశారు. మా భర్తలు, కొడుకులు ఆ రోజు నుంచి కనిపించడం లేదు. వారు కనిపిస్తలేరని పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే మమ్మల్ని కూడా అరెస్టు చేస్తరేమోనని భయమైతున్నది. అప్పటినుంచి బిక్కుబిక్కుమనుకుంట తండాలల్లనే బతుకుతున్నం’ అంటూ వారు వాపోయారు. 

`12 రోజుల నుంచి భయంభయంతోనే కాలం ఎల్లదీస్తున్నం. ఎప్పుడు ఎవరు వస్తరో.. ఏం జరుగుతందో తెల్వక తిండి, నిద్ర లేకుండ పాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నం. పొలాలకు పోతలేము. వరి, కంది పంటలు చేతికొచ్చినయి. వాటిని కోయకుంటే గింజలు నేలరాలుతయ్‌’ అంటూ లగచర్ల, దాని చుట్టుపక్కల తండాల ప్రజలు ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యుల ముందు కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ నెల 11న ఉదయం దుద్యాల మండలంలోని హకీంపేట-దుద్యాల గ్రామాల మధ్యలో అధికారులు ఫార్మావిలేజ్‌ ఏర్పాటులో భాగంగా భూసేకరణ కోసం మీటింగ్‌ ఏర్పాటు చేశారని.. తమకు భూములిచ్చే ఉద్దేశం లేకపోవడంతో రైతులందరం లగచర్ల గ్రామంలోనే ఉన్నామని బాధితులు ఎన్‌హెచ్‌ఆర్సీ బృందంతో చెప్పారు. 

కాగా కలెక్టర్‌ ఎటువంటి సమాచారం లేకుండా లగచర్లకు వచ్చారని, తామంతా ఫార్మా గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశామని తెలిపారు. వచ్చింది కలెక్టర్‌ అని తమకు తెలియదని, అధికారులు కావొచ్చని వారితో మాట్లాడుతున్న క్రమంలో తోపులాట జరిగిందని వివరించారు. ఇది కావాలని చేసింది కాదని చెప్పారు. కానీ ఆ ఘటనను కావాలనే దాడిగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఘటన రోజు తీసిన వీడియోల ఆధారంగా 300 మంది పోలీసులు అర్ధరాత్రి లైట్లు తీసేసి రోటిబండతండాలో ఉన్న పురుషులను వ్యాన్లలో ఎక్కించారని, మగవారు లేని ఇండ్లలో మహిళలతో దురుసుగా ప్రవర్తించారని, ఫార్మావిలేజ్‌కి భూములిచ్చే ప్రసక్తి లేదని వారు స్పష్టంచేశారు. దాడి జరిగిన రోజు పోలీసులు తమపై కూడా దాడి చేశారని, ఇంకా ఆ దెబ్బలకు నొప్పులతో బాధపడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. 

తామంతా అణగారిన వర్గాలకు చెందిన వారిమని తమకు న్యాయం చేయాలని కమిషన్‌ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఘటన జరిగిన రోజు గాయపడిన బాధితులను ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స అందించాలని ఏఎన్ఎంను ఆదేశించారు.