
‘పోలీసులు మగవారు లేని ఇండ్లలోకి చొరబడి మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారు. కరెంటు తీసేసి ఊరు లోపలికి వచ్చి దాడి చేశారు. మా భర్తలు, కొడుకులు ఆ రోజు నుంచి కనిపించడం లేదు. వారు కనిపిస్తలేరని పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే మమ్మల్ని కూడా అరెస్టు చేస్తరేమోనని భయమైతున్నది. అప్పటినుంచి బిక్కుబిక్కుమనుకుంట తండాలల్లనే బతుకుతున్నం’ అంటూ వారు వాపోయారు.
`12 రోజుల నుంచి భయంభయంతోనే కాలం ఎల్లదీస్తున్నం. ఎప్పుడు ఎవరు వస్తరో.. ఏం జరుగుతందో తెల్వక తిండి, నిద్ర లేకుండ పాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నం. పొలాలకు పోతలేము. వరి, కంది పంటలు చేతికొచ్చినయి. వాటిని కోయకుంటే గింజలు నేలరాలుతయ్’ అంటూ లగచర్ల, దాని చుట్టుపక్కల తండాల ప్రజలు ఎన్హెచ్ఆర్సీ సభ్యుల ముందు కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ నెల 11న ఉదయం దుద్యాల మండలంలోని హకీంపేట-దుద్యాల గ్రామాల మధ్యలో అధికారులు ఫార్మావిలేజ్ ఏర్పాటులో భాగంగా భూసేకరణ కోసం మీటింగ్ ఏర్పాటు చేశారని.. తమకు భూములిచ్చే ఉద్దేశం లేకపోవడంతో రైతులందరం లగచర్ల గ్రామంలోనే ఉన్నామని బాధితులు ఎన్హెచ్ఆర్సీ బృందంతో చెప్పారు.
కాగా కలెక్టర్ ఎటువంటి సమాచారం లేకుండా లగచర్లకు వచ్చారని, తామంతా ఫార్మా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశామని తెలిపారు. వచ్చింది కలెక్టర్ అని తమకు తెలియదని, అధికారులు కావొచ్చని వారితో మాట్లాడుతున్న క్రమంలో తోపులాట జరిగిందని వివరించారు. ఇది కావాలని చేసింది కాదని చెప్పారు. కానీ ఆ ఘటనను కావాలనే దాడిగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఘటన రోజు తీసిన వీడియోల ఆధారంగా 300 మంది పోలీసులు అర్ధరాత్రి లైట్లు తీసేసి రోటిబండతండాలో ఉన్న పురుషులను వ్యాన్లలో ఎక్కించారని, మగవారు లేని ఇండ్లలో మహిళలతో దురుసుగా ప్రవర్తించారని, ఫార్మావిలేజ్కి భూములిచ్చే ప్రసక్తి లేదని వారు స్పష్టంచేశారు. దాడి జరిగిన రోజు పోలీసులు తమపై కూడా దాడి చేశారని, ఇంకా ఆ దెబ్బలకు నొప్పులతో బాధపడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
తామంతా అణగారిన వర్గాలకు చెందిన వారిమని తమకు న్యాయం చేయాలని కమిషన్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఘటన జరిగిన రోజు గాయపడిన బాధితులను ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స అందించాలని ఏఎన్ఎంను ఆదేశించారు.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్లో చీలిక!
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్
గిరిజనుల కోసం డిజిటల్ వేదిక “ఆది సంస్కృతి” బీటా వెర్షన్