13 రాష్ట్రాల్లో ఉపఎన్నికలు.. మెజారిటీ స్థానాల్లో ఎన్డీఏ గెలుపు

13 రాష్ట్రాల్లో ఉపఎన్నికలు.. మెజారిటీ స్థానాల్లో ఎన్డీఏ గెలుపు

దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు అధికార పార్టీల ఖాతాలోనే పడ్డాయి. అసోం, బిహార్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో మెజారిటీ స్థానాలను ఎన్డీఏ గెలుచుకోగా, బెంగాల్లోని ఆరుకు ఆరు స్థానాలను టీఎంసి కైవసం చేసుకుంది.

కర్ణాటకలోని చన్నపట్న అసెంబ్లీ ఉప ఎన్నికలో కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి ఓడిపోయారు. ఆ రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షమైన జేడీ(ఎస్‌)కు చెందిన ఆయన 25,413 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి సీపీ యోగేశ్వరా చేతిలో పరాజయం పొందారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని 9 అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిలో బీజేపీ విజయం సాధించింది. 2 స్థానాలను సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు వశం చేసుకోగా ఒక చోట బీజేపీ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్‌దళ్‌ సత్తా చాటింది.  రాజస్థాన్‌లోని 7 స్థానాల్లో ఐదింటిలో బీజేపీ విజయ దుందుభి మోగించింది. దౌసాలో కాంగ్రెస్‌ గెలుపొందగా, చోరాసిని బిఎడివిపి చేజిక్కించుకుంది.

బంగాల్లోని ఆరింటికి ఆరు స్థానాలూ మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఖాతాలోనే పడ్డాయి. కోల్‌కతా హత్యాచార ఘటన నేపథ్యంలోనూ టీఎంసీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడం గమనార్హం. అసోంలోని 5 స్థానాల్లో మూడు చోట్ల బీజేపీ జెండా ఎగరవేసింది. ఏజీపీ, యూపీపీఎల్ చెరో స్థానంలో విజయం సాధించాయి.

పంజాబ్లో 4 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో మూడింటిని ఆప్‌, ఒకదాన్ని కాంగ్రెస్‌ సొంతం చేసుకున్నాయి. బిహార్లోని 4 శాసనసభ స్థానాల్లో 3 స్థానాలను అధికార ఎన్డీఏ కైవసం చేసుకుంది. ఒకస్థానంలో హెచ్ఏఎం పైచేయి సాధించింది. కర్ణాటకలోని మొత్తం 3 స్థానాల్లోనూ అధికార కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది.

మధ్యప్రదేశ్లోని 2 అసెంబ్లీ స్థానాల్లో ఒకదాన్ని కాంగ్రెస్‌, మరొకదాన్ని బీజేపీ గెలుచుకున్నాయి. కేరళలోని పాలక్కాడ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపొందగా, చెలక్కర వామపక్షం (ఎల్డీఎఫ్) ఖాతాలో పడిపోయింది. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, గుజరాత్‌లోని ఒక్కో స్థానం బీజేపీ సొంతమయ్యాయి. మేఘాలయలోని ఒక స్థానంలో ఎన్‌పీపీ అభ్యర్థి, సీఎం కాన్రాడ్‌ సంగ్మా సతీమణి మెహ్తాబ్‌ సంగ్మా విజయం సాధించారు. సిక్కింలో రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరగగా, ఆ రెండింటిని అధికార సిక్కిం క్రాంతికార మోర్చా ఏకగ్రీవంగా గెలుచుకుంది.