విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీలను అప్పగించమని కోరిన మోదీ

విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీలను అప్పగించమని కోరిన మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం బ్రెజిల్‌లో పర్యటిస్తూ బ్రెజిల్‌ రాజధాని రియో డి జెనీరో వేదికగా సోమవారం ప్రారంభమైన జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పలు దేశాధినేతలతో మోదీ వరుసగా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక నేరగాళ్లు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీలను భారత్‌కు అప్పగించాలని ఆయన్ని మోదీ కోరారు.

భారత్‌లో రూ.9వేల కోట్ల మేరకు బ్యాంకు రుణం ఎగవేసి విజయ్‌ మాల్యా దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. 2016లో ఆయన లండన్ పారిపోయాడు. ఆ తర్వాత పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు నీరవ్‌ మోదీ దాదాపు రూ.14 వేల కోట్ల రుణం ఎగవేసిన ఉదంతం 2018లో వెలుగులోకి వచ్చింది. అతను కూడా విదేశాలకు పారిపోయాడు. ఈ కేసును సీబీఐ, ఈడీ విచారిస్తోంది. 

దర్యాప్తులో భాగంగా నీరవ్‌ ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ ఇద్దరు ఆర్థిక నేరగాళ్లను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో నీరవ్‌ మోదీ తమదేశంలోనే నివసిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం 2018 డిసెంబర్‌లో ప్రకటించింది. దీంతో అతడిని తమకు అప్పగించాలని భారత్‌ విజ్ఞప్తి చేయగా 2019లో నీరవ్‌ మోదీని అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అతన్ని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. ఈ పరిణామాలతో నీరవ్‌ అక్కడి కోర్టులో పిటిషన్‌ వేయగా దాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. తాజాగా వీరిని అప్పగించాలంటూ బ్రిటన్‌ ప్రధానిని మోదీ కోరారు. వీరితోపాటు పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్ను మధ్యవర్తి సంజయ్‌ భండారీని కూడా రప్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నది.

కాగా, ప్రపంచంలో నేడు ఆయా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల కారణంగా ‘గ్లోబల్‌ సౌత్‌’ దేశాలు ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభాన్ని తీవ్రస్థాయిలో ఎదుర్కొంటున్నాయని భారత ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘గ్లోబల్‌ సౌత్‌’ దేశాలు ఎదుర్కొంటున్న ఈ సంక్షోభాన్ని పరిష్కరించటంపై జీ-20 దేశాల కూటమి దృష్టి సారించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు.  జీ20 దేశాల శిఖరాగ్ర  సదస్సుకు అమెరికా, చైనా అధ్యక్షులు జో బైడెన్‌, జీ జిన్‌పింగ్‌, బ్రిటిన్‌ పీఎం స్టార్మర్‌ సహా ఆయా దేశాల నాయకులు హాజరయ్యారు.